FSSAI Action on Nestle: శిశు పోషణ, పసిపిల్లల ఆహారం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఎంతటి ప్రముఖ సంస్థకైనా చిక్కులు తప్పవు. భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) ప్రముఖ దిగ్గజ కంపెనీ అయిన ‘నెస్లే ఇండియా’కు షాక్ ఇచ్చింది. నెస్లే తయారుచేసే మూడు రకాల పసిపిల్లల న్యూట్రిషన్ ఉత్పత్తులపై నిబంధనలు పాటించలేదనే ఆరోపణలతో లీగల్ నోటీసులు జారీ చేసి, లీగల్ చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ అంశంపై విచారణ ప్రారంభమైంది.
అసలు ఏం జరిగిందంటే..?
ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్లలో నెస్లే ప్రమోట్ చేసుకుంటున్న ప్రచార ప్రకటనలు, ఉత్పత్తుల నాణ్యతను FSSAI నిశితంగా పరిశీలించింది. ఇందులో ప్రధానంగా ‘నాన్ ఎక్సెల్లా ప్రో స్టేజ్ 1’ (NAN Excella Pro Stage 1) ప్రచారంలో “5 HMOs”, “వే ప్రోటీన్” వంటి విశేషాలు ఉన్నట్లు నెస్లే క్లెయిమ్ చేసింది. అలాగే ‘లాక్టోజెన్ ప్రో 1’ (Lactogen Pro 1) విషయంలోనూ అందులోని ‘వే ప్రోటీన్’ త్వరగా అరుగుతుందని ప్రచారం చేశారు. దీనిపై FSSAI వివరణ కోరగా, నెస్లే ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదు. చిన్నపిల్లల ఆహార అమ్మకాలను పెంచుకోవడానికి ఇలాంటి ఆకర్షణీయమైన ప్రకటనలు చేయడం ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ 2020’ నిబంధనలకు విరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు.
శిశువుల ఆహారం విషయంలో ఇంత కఠినంగా ఎందుకు ఉంటారంటే..?
పసిపిల్లల ఎదుగుదలలో ఆహారం అత్యంత చాలాకమైనది. మార్కెటింగ్ జిమ్మిక్కులు చూసి తల్లిదండ్రులు తప్పుదారి పట్టకూడదనే ఉద్దేశంతోనే భారత్లో కఠిన చట్టాలు ఉన్నాయి. 1992 నాటి ‘ఇన్ఫాంట్ మిల్క్ సబ్స్టిట్యూట్స్ యాక్ట్’ ప్రకారం శిశు ఆహారాల ప్రకటనలు, ప్రచారాలపై స్పష్టమైన పరిమితులు ఉన్నాయి. వ్యాపార ప్రకటనలు తల్లిదండ్రుల నిర్ణయాలను ప్రభావితం చేయకూడదనేదే దీని ముఖ్య ఉద్దేశం. ఇక, కేవలం ప్రచార ఆర్భాటాలే కాకుండా, పోషకాల పరిమాణంలోనూ ఒక ఉత్పత్తి విఫలమైంది. నెస్లే తయారుచేసిన ఒక ఫాలో-అప్ ఫార్ములా (Follow-up Formula) శాంపిల్ను ల్యాబ్లో పరీక్షించగా, అందులో ఉండాల్సిన ‘బయోటిన్’ (విటమిన్ B7) ప్రమాణాలు తగ్గట్లుగా లేవు. అనుమానంతో దీన్ని రెఫరల్ ల్యాబొరేటరీకి పంపగా, అక్కడ కూడా అదే విషయం నిర్ధారణ అయింది. పసిపిల్లల శరీర విధులకు విటమిన్ B7 చాలా అవసరం. నిబంధనల ప్రకారం నిర్దేశించిన మోతాదు లేకపోవడంతో దీన్ని ‘సబ్స్టాండర్డ్’ (ప్రమాణాలకు సరిపోనిది)గా పరిగణించారు. మొత్తంగా నెస్లే ఇండియాపై మూడు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. ప్రచార ఆరోపణలపై రెండు, పోషకాల లోపంపై ఒక కేసు ఉన్నాయి. సంబంధిత ప్రాధికార సంస్థ విచారణ పూర్తయిన తర్వాతే దీనిపై తుది నిర్ణయం రానుంది.

