Political Leaders Plane Crashes: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేడు (బుధవారం) విమాన ప్రమాదంలో మృతి చెందడం దేశవ్యాప్తంగా విషాద ఛాయలను మిగిలించింది. గత ఏడాది జూన్ 2025లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువకముందే.. కేవలం ఏడు నెలల వ్యవధిలోనే మరో ప్రముఖ జాతీయ నాయకుడు ఈ విధంగా మృతి చెందడం దేశ రాజకీయ వర్గాలను విషాదంలో ముంచింది. భారత రాజకీయ చరిత్రను పరిశీలిస్తే ఇప్పటివరకు మొత్తం ఏడుగురు ప్రముఖ నేతలు ప్లేన్, హెలికాప్టర్ క్రాష్ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు కూడా.
భారతదేశంలో విమాన ప్రమాదంలో మరణించిన తొలి ప్రముఖ రాజకీయ నేతగా బల్వంత్రాయ్ మెహతా గుర్తింపు పొందారు. ఈయన 1963 నుంచి 1965 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన.. 1965 భారత్, పాక్ యుద్ధ సమయంలో కచ్ రణ్ ప్రాంతంలో పరిస్థితులను పరిశీలించేందుకు వెళ్తుండగా పాకిస్థాన్ దాడిలో ఆయన ప్రయాణిస్తున్న విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో మెహతాతో పాటు ఆయన భార్య, ముగ్గురు సిబ్బంది, ఒక జర్నలిస్ట్, ఇద్దరు విమాన సిబ్బంది మృతి చెందారు.
సంజయ్ గాంధీ 1980 జూన్ 23న ఢిల్లీలో జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. విమానం నడపడంపై ఆసక్తి కలిగిన సంజయ్ గాంధీ.. ఒక స్టంట్ ప్రదర్శించబోయే క్రమంలో విమానం కూలిపోవడంతో ఆయనతో పాటు మరోవ్యక్తి సుభాష్ సక్సేనా మృతి చెందారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత మాధవరావ్ సింధియా 2001 సెప్టెంబర్ 30న విమాన ప్రమాదంలో మృతి చెందారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో నిర్వహించనున్న ర్యాలీకి వెళ్తుండగా మైన్పురి సమీపంలోని మోటాగావ్ వద్ద ఆయన విమానం కూలిపోయింది. అప్పటికి ఆయన వయస్సు 56 సంవత్సరాలు.
లోక్సభ స్పీకర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న జి.ఎం.సి. బాలయోగి 2002లో హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్లో ఒక కార్యక్రమానికి వెళ్తుండగా హెలికాప్టర్ కూలిపోవడంతో బాలయోగితో పాటు ఆయన భద్రతా అధికారి డి. సత్య రాజు, పైలట్ కెప్టెన్ జి.వి. మేనన్ అక్కడికక్కడే మృతి చెందారు.
Ajit Pawar: సీఎం ఫడ్నవిస్కు మోడీ, అమిత్ షా ఫోన్.. అజిత్ పవార్ మృతిపై ఆరా
2009లో జరిగిన మరో ఘోర ఘటనలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. నల్లమల అటవీ ప్రాంతం మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
2011లో విమాన ప్రమాదంలో డోర్జీ ఖాండు (అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి) మృతి చెందారు. తవాంగ్ నుంచి రాజధాని ఇటానగర్కు వెళ్తుండగా ఆయన విమానం మిస్ అయ్యింది. అయితే ఆ తరువాత శిథిలాలు లభ్యమయ్యాయి. అప్పటికి ఆయన వయస్సు 56 సంవత్సరాలు.
ఇక ఇటీవలి కాలంలో 2025 జూన్ 12న విజయ్ రూపాణి (గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి) అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ సభ్యులను కలిసేందుకు వెళ్తున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది.
OnePlus 16 Leaks: 9000mAh బ్యాటరీ, 200MP కెమెరా, ఇంకా ఎన్నెన్నో.. స్మార్ట్ఫోన్ మార్కెట్ షేకే ఇగ!
ఇప్పుడు ఈ జాబితాలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ పేరు కూడా చేరింది. వరుసగా జరుగుతున్న ఈ విమాన ప్రమాదాలు భారత రాజకీయ చరిత్రలో చెరగని విషాద అధ్యాయాలుగా మిగిలిపోతున్నాయి.