Formula E Case: తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఫార్ములా-ఈ రేస్ కేసులో నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఏసీబీ కోర్టులో నేడు విచారణ ప్రారంభం కానుంది. ఈ వ్యవహారంలో గత మార్చి 23న ఏసీబీ అధికారులు కోర్టులో 77 పేజీలతో కూడిన సమగ్ర చార్జిషీట్ను దాఖలు చేయగా, 14 మంది సాక్షుల వాంగ్మూలాలను అందులో పేర్కొన్నారు. ఈ చార్జిషీట్ను పరిశీలించిన ఏసీబీ కోర్టు మే 14న విచారణకు ఆమోదం తెలపడమే కాకుండా, ఈ రోజు (జులై 31) విచారణకు నేరుగా హాజరు కావాలంటూ నిందితులకు సమన్లు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం నేడు జరిగే విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్తో పాటు మాజీ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బి.ఎల్.ఎన్. రెడ్డి, స్పోర్ట్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వర్ రావులు హాజరు కానున్నారు. ఈ కేసులో యూకేకు చెందిన ఎఫ్ఈఓ సంస్థ ప్రతినిధి అల్బెర్టోకు కూడా కోర్టు సమన్లు జారీ చేసింది.
ఈ వ్యవహారంలో ఆర్థిక, న్యాయ శాఖల అనుమతులు కానీ, క్యాబినెట్ ఆమోదం కానీ లేకుండానే ఫార్ములా-ఈ రేస్ సీజన్ 10 నిర్వహణ కోసం నిధులను విడుదల చేసి దుర్వినియోగానికి పాల్పడ్డారని ఏసీబీ పేర్కొంది. నిబంధనలను తుంగలో తొక్కి చేసుకున్న ఈ ఒప్పందాల వల్ల హెచ్ఎండీఏకు నేరుగా సుమారు రూ.78 కోట్ల నష్టం వాటిల్లడమే కాకుండా, ప్రభుత్వంపై అదనంగా దాదాపు రూ.600 కోట్ల మేర భారం పడిందని చార్జిషీట్లో స్పష్టం చేశారు. అంతేకాకుండా, ‘ఎస్ నెక్స్ట్ జెన్’ సంస్థకు అనుచిత లబ్ధి చేకూర్చినందుకు ప్రతిఫలంగా ‘గ్రీన్ కో’ సంస్థ నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్లు వచ్చాయని, ఇది స్పష్టమైన క్విడ్ ప్రో కో అని ఏసీబీ తన నివేదికలో మోపిన ప్రధాన అభియోగం. చార్జిషీట్ దాఖలైన తర్వాత జరుగుతున్న మొదటి విచారణ కావడంతో నిందితులందరూ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ఈ రోజు విచారణ సందర్భంగా ఏసీబీ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనేది రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

