హుజురాబాద్ ఎన్నికల ముందు టిఆర్ఎస్లో చేరిన కౌశిక్ రెడ్డికి అదృష్టం పట్టిందనుకున్నారు. గవర్నర్ కోటాలో కౌశిక్ రెడ్డి ఫైల్ పెండింగ్లో ఉండటంతో ఏం జరుగుతుందనే ఆసక్తి ఏర్పడింది. హుజురాబాద్లో ఓటమితో టియ్యారెస్ అధిష్టానం మరో కొత్త ప్లాన్ వేసింది. ఏమిటా ప్లాన్ ? అది అమలయ్యేదెప్పుడు?
గత ఎన్నికల్లో ఈటల రాజేందర్ పై హుజురాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కౌశిక్ రెడ్డి అనూహ్యంగా అధికార టిఆర్ఎస్లో చేరిపోయారు. ఈటల రాజీనామా తర్వాత కాంగ్రెస్లో తనకు టికెట్ రాకుండా చేస్తున్నారన్న అనుమానంతో జంప్ అయ్యారు.
కారెక్కిన కొన్నాళ్లకే కౌశిక్ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది కేబినెట్. విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్కుకు టిఆర్ఎస్ టికెట్ ఇచ్చి పోటీ చేయించారు. ఆ కోటాలో కౌశిక్ ఫిట్ అవుతాడా లేదా అన్న దానిపై గవర్నర్ ఫైలును పెండింగ్ లో పెట్టారు. ఇప్పుడు హుజురాబాద్లో టిఆర్ఎస్ ఓడిపోయింది. ఈటల హుజురాబాద్లో గెలవడంతో ఇప్పుడు వ్యూహం మార్చింది. గవర్నర్ కోటాకు బదులుగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే షెడ్యూల్ విడుదల కావడంతో కౌశిక్ రెడ్డి రెడీ అవుతున్నారు. ఈటలకు పోటీగా హుజురాబాద్లో కౌశిక్ రెడ్డికి ప్రోటోకాల్ ఇచ్చి పార్టీని బలోపేతం చేయాలని ఆలోచిస్తోంది కారు పార్టీ. రాజకీయ ఎత్తుగడలో భాగంగా కౌశిక్కు ఎమ్మెల్సీ పదవిపి క్లియర్ చేయడంతో హుజురాబాద్ రాజకీయం మరింత రసవత్తరంగా మారనుంది.