ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐదుగురు నాన్-స్టేట్ సివిల్ సర్వీస్ (Non-SCS) అధికారులకు ఐఏఎస్లు (IAS)గా పదోన్నతి లభించింది. 2024 సెలెక్ట్ లిస్ట్ ఆధారంగా వీరికి ఐఏఎస్ హోదా కల్పిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అధికారులందరినీ ఆంధ్రప్రదేశ్ కేడర్కు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఐఏఎస్లుగా ఎంపికైన అధికారులు వీరే..
ప్రభుత్వం విడుదల చేసిన జాబితా ప్రకారం.. ప్రభల గోపినాథ్, గుడిశ బాలకృష్ణ, ఎం. జయకృష్ణ, ఏ.ఏ.ఎల్. పద్మావతి, మరియు డాక్టర్ మామిళ్లపల్లి వరప్రసాద్లు ఐఏఎస్ అధికారులుగా పదోన్నతి పొందారు. వీరంతా వివిధ ప్రభుత్వ శాఖలలో సుదీర్ఘ కాలం పాటు నాన్-స్టేట్ సివిల్ సర్వీస్ అధికారుల విభాగంలో విశేష సేవలు అందించారు. వారి పనితీరు, సీనియారిటీ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం పంపిన సిఫార్సులను పరిశీలించిన కేంద్ర నియామకాల కమిటీ, తుది జాబితాను ఖరారు చేసింది.
పాలనలో మరింత వేగం..
రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల కొరతను అధిగమించడానికి , పరిపాలనను మరింత బలోపేతం చేయడానికి ఈ పదోన్నతులు ఎంతగానో దోహదపడతాయని సచివాలయ వర్గాలు పేర్కొన్నాయి. వివిధ శాఖల్లో క్షేత్రస్థాయిలో అపారమైన అనుభవం ఉన్న ఈ నాన్-స్టేట్ సివిల్ సర్వీస్ అధికారులు ఐఏఎస్లుగా బాధ్యతలు చేపట్టడం వల్ల ప్రభుత్వ పథకాల అమలు, ప్రజలకు సేవలందిచడంలో మరింత పారదర్శకత, వేగం పెరుగుతుందని భావిస్తున్నారు. త్వరలోనే వీరికి రాష్ట్ర ప్రభుత్వం నూతన పోస్టింగులను కేటాయించనుంది. పదోన్నతి పొందిన అధికారులకు పలువురు సహచర అధికారులు, ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు.

