FASTag New Rules: దేశవ్యాప్తంగా వాహనదారులకు FASTag ఇప్పుడు ఒక ముఖ్యమైన భాగంగా మారింది. టోల్ ప్లాజాల వద్ద ఆగకుండా ఆటోమేటిక్గా చెల్లింపులు జరిగే విధంగా ఇది పనిచేస్తుంది. ఫాస్టాగ్ను వాహనానికి అమర్చినట్లయితే, టోల్ ఛార్జీలు మీ ప్రీపెయిడ్, సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతా నుండి నేరుగా డెబిట్ అవుతాయి. దీంతో టోల్ ప్లాజాల వద్ద ఉండే పొడవైన క్యూలకు గుడ్బై చెప్పవచ్చు. ప్రతి లావాదేవీ తర్వాత వినియోగదారులకు SMS ద్వారా సమాచారం అందుతుంది. అయినప్పటికీ, ఫాస్టాగ్కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు చాలామందికి తెలియకపోవడం గమనార్హం.
National Highways Authority of India (NHAI) వార్షిక పాస్ ధరను రూ.75 పెంచింది. గతంలో రూ.3,000గా ఉన్న ఈ పాస్, 2026 ఏప్రిల్ 1 నుంచి రూ.3,075కు పెరుగుతుంది. ఈ వార్షిక పాస్ తీసుకుంటే, ఒక సంవత్సరానికి 200 టోల్ ప్లాజాల వరకు ప్రయాణానికి రీఛార్జ్ అవసరం ఉండదు. ఈ పాస్ను వాణిజ్యేతర వాహనాలకు జారీ చేస్తారు. ఇది కొనుగోలు చేసిన తర్వాత సుమారు రెండు గంటల్లో యాక్టివేట్ అవుతుంది. వినియోగదారులు దీన్ని Rajmargyatra App లేదా అధికారిక NHAI వెబ్సైట్ ద్వారా పొందవచ్చు.
ఫాస్టాగ్ సరిగా అమర్చకపోతే, వాహనదారులు భారీ జరిమానాలు చెల్లించాల్సి రావచ్చు. విండ్షీల్డ్పై సరిగ్గా అమర్చని ఫాస్టాగ్ కారణంగా స్కానింగ్లో సమస్యలు వస్తే, టోల్ ప్లాజాల వద్ద రెట్టింపు ఛార్జీ వసూలు చేసే అవకాశం ఉంది. ఇంకా, జాతీయ రహదారులపై నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో వాహనదారులకు ఉపశమనం కల్పించేందుకు టోల్ ఫీజును సగానికి తగ్గించే నిబంధన కూడా ఉంది. రోడ్లను రెండు లేన్ల నుంచి నాలుగు లేదా అంతకంటే ఎక్కువ లేన్లకు విస్తరించే సమయంలో ఈ సడలింపు వర్తిస్తుంది.
అదేవిధంగా, ఫాస్టాగ్ లేకుండా లేదా లోపభూయిష్టమైన ట్యాగ్తో టోల్ ప్లాజాలోకి ప్రవేశిస్తే రెట్టింపు టోల్ వసూలు చేస్తారు. నగదు చెల్లింపులపై కూడా రెట్టింపు ఛార్జీ విధించబడుతుంది. యూపీఐ చెల్లింపులపై సుమారు 1.25 రెట్లు ఫీజు ఉండే అవకాశం ఉంది. అనవసరమైన జరిమానాలను నివారించాలంటే, మీ ఫాస్టాగ్ ఖాతాను ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేసి ఉంచుకోవడం, అలాగే ట్యాగ్ను సరిగా అమర్చుకోవడం చాలా ముఖ్యం. ఫాస్టాగ్కు సంబంధించిన ఫిర్యాదుల కోసం 1033 హెల్ప్లైన్ను సంప్రదించవచ్చు. అలాగే Rajmargyatra App ద్వారా టోల్ ప్లాజాలు, పెట్రోల్ బంకులు, ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు, వాతావరణ సమాచారం వంటి వివరాలను కూడా తెలుసుకోవచ్చు.