గుజరాత్లో నకిలీ నోట్ల ముఠా భరతం పట్టారు పోలీసులు. తీగ లాగితే డొంక కదిలినట్లు ఈ కేసులో కింగ్ పిన్గా ఉన్న వ్యక్తి సైతం పట్టుబడ్డాడు. అంతే కాదు .. తనకు తాను గాడ్మ్యాన్గా చెప్పుకుంటూ.. యోగాశ్రమం ముసుగులో ఫేక్ కరెన్సీ రాకెట్ నడిపిస్తున్న వ్యక్తిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. ఇంతకీ కంత్రీ గాడ్మ్యాన్ ఎవరు? అసలు ఫేక్ కరెన్సీ ముఠా బాగోతం ఎలా బయటకు వచ్చింది? వారు పేక్ కరెన్సీ ఎక్కడెక్కడ చలామణి చేశారు?
నకిలీ నోట్ సామ్రాజ్యం..
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఫేక్ కరెన్సీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఆ ముఠా దేశవ్యాప్తంగా తమ నెట్వర్క్ ద్వారా పెద్ద ఎత్తున ఫేక్ కరెన్సీ చలామణి చేసిందనే విషయం బయటపడింది. మొత్తంగా ఈ ఆపరేషన్ అంతా.. అహ్మదాబాద్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ బ్రాంచ్.. DCB నేతృత్వంలో జరిగింది. ఇందులో ప్రధాన సూత్రధారుడు స్వయంప్రకటిత గాడ్మ్యాన్ ప్రదీప్ జోతంగియా అలియాస్ ప్రదీప్జీతోపాటు మరో ఏడుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు.
నిజానికి పోలీసుల కళ్లుగప్పి ఈ నకిలీ నోట్ల ముఠా పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఐతే ఇటీవల అహ్మదాబాద్లోని అమ్రైవాడి ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వాహనాన్ని పోలీసులు అడ్డగించారు. ఆ వెహికిల్ తనిఖీ చేయడంతో రూ. 500 నోట్లు కట్టలు కట్టలుగా కనిపించాయి. ముందుగా అన్అకౌంటెడ్ మనీ అనుకున్నారు పోలీసులు. ఆ తర్వాత క్షుణ్నంగా తనిఖీ చేస్తే..ఫేక్ కరెన్సీ అని బయటపడింది. అందులోని వ్యక్తులను ఇంటరాగేషన్ చేయడంతో సూరత్లో నకిలీ నోట్ల ప్రింట్ చేస్తూ.. మర్కెట్లోకి వదులుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు సూరత్లోని కమ్రేజ్ ప్రాంతంలో ఉన్న శ్రీ సత్య యోగా ఫౌండేషన్లో సోదాలు నిర్వహించారు. అక్కడ ఏకంగా 2.38 కోట్ల రూపాయల విలువైన ఫేక్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. సత్య యోగ ఫౌండేషన్ను నిర్వహిస్తున్న ప్రదీప్ జోతంగియా తనకు తాను గాడ్మ్యాన్గా ప్రకటించుకున్నాడు. కోట్లాది మంది భక్తులను తయారు చేసుకున్నాడు. ఆ ముసుగులో ఫేక్ కరెన్సీ దందా స్టార్ట్ చేశాడు. తన ఆశ్రమంలోనే ఫేక్ కరెన్సీ నోట్లు తయారు చేస్తూ కస్టమర్లకు స్వయంగా డోర్ డెలివరీ చేస్తున్నాడు. దేశవ్యాప్తంగా తన సొంత వాహనాల్లోనే నకిలీ కరెన్సీ రవాణా చేస్తున్నాడు.
ప్రదీప్ జోతంగియా నేతృత్వంలోని ఈ ముఠా కేవలం గుజరాత్కే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా నకిలీ కరెన్సీ పంపిణీ చేసే నెట్వర్క్ను ఏర్పాటు చేసిందని పోలీసులు భావిస్తున్నారు. ముఖ్యంగా పండుగలు, పెద్ద ఈవెంట్ల సమయంలో మార్కెట్లో నకిలీ నోట్లను చలామణి చేసే ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. ఈ కేసు నేపథ్యంలో నకిలీ కరెన్సీ రాకెట్లపై రాష్ట్రవ్యాప్తంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. త్వరలోనే ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.