దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రైవేట్ ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తీపి కబురు అందించింది. పీఎఫ్ ఉపసంహరణ (Withdrawal) ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులకు స్వస్తి పలుకుతూ.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇకపై ఈపీఎఫ్ఓ సేవల్లో మానవ ప్రమేయం తగ్గిస్తూ.. పూర్తిస్థాయిలో ఆటోమేషన్ విధానాన్ని అమలు చేయనుంది. ఇప్పటివరకు మనం పీఎఫ్ క్లెయిమ్ కోసం ఈపీఎఫ్ఓ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే.. ఆ పత్రాలను సంబంధిత అధికారులు స్వయంగా పరిశీలించి ఆమోదించాల్సి వచ్చేది. ఈ ప్రక్రియ వల్ల క్లెయిమ్ సెటిల్ కావడానికి రోజుల తరబడి సమయం పట్టేది. సెలవు రోజుల్లో అయితే ఈ జాప్యం మరీ ఎక్కువగా ఉండేది.
Also Read:Speaker Ayyanna Patrudu: ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండి తీరాలి.. మసాలా లేకపోతే ఎలా..?
కానీ.. కొత్తగా వస్తున్న ఆటో-సెటిల్మెంట్ వ్యవస్థ ద్వారా అధికారుల ఆమోదం అవసరం లేకుండానే సాఫ్ట్వేర్ ద్వారానే మీ వివరాల వెరిఫికేషన్ పూర్తవుతుంది. దీనివల్ల దరఖాస్తు చేసిన అతి తక్కువ సమయంలోనే నగదు నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. ఈ వేగవంతమైన సేవలను పొందాలంటే పీఎఫ్ ఖాతాదారులు ఒక పని పూర్తి చేయాల్సి ఉంటుంది. మీ ఈపీఎఫ్ఓ పోర్టల్లో ఆధార్ , బ్యాంక్ కేవైసీ (KYC) అప్డేట్ అయి ఉండాలి. క్లెయిమ్ స్టేటస్ గురించి మీకు ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ (SMS) , ఈమెయిల్ ద్వారా సమాచారం అందుతుంది.
Also Read:Shocking Incident : సాయం చేద్దామని వెళ్తే సర్వం దోచేశారు.. అమలాపురంలో దొంగల మాయాజాలం.!
చాలా కాలంగా లావాదేవీలు లేని (Inoperative) పీఎఫ్ ఖాతాల విషయంలోనూ ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వెయ్యి రూపాయల కంటే తక్కువ నగదు ఉండి.. నిరుపయోగంగా ఉన్న ఖాతాలను ఆటోమేటిక్గా క్లెయిమ్ చేసి.. ఆ సొమ్మును ఆ వ్యక్తి ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. మీ పీఎఫ్ ఖాతా గనుక ఇన్-యాక్టివ్ మోడ్లో ఉంటే.. వెంటనే దానిని యాక్టివేట్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల పీఎఫ్ ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా.. ఇంటి నుంచే వేగంగా సేవలు పొందే అవకాశం కలుగుతుంది. మీరు కూడా వెంటనే ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్ను సందర్శించి మీ కేవైసీ వివరాలను సరిచూసుకోండి.