NTV Telugu Site icon

IND vs ENG: చెలరేగిన బుమ్రా, అశ్విన్.. వైజాగ్ టెస్టులో భారత్ ఘన విజయం!

India Test Team

India Test Team

India won by 106 runs against England in Vizag: వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 399 పరుగుల లక్ష్య ఛేదనలో 69.2 ఓవర్లలో 292 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో 106 పరుగుల తేడాతో రోహిత్ సేన గెలిచింది. టామ్ హార్ట్‌లీ (36)ను జస్ప్రీత్ బుమ్రా క్లీన్‌ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్, బుమ్రా తలో మూడు వికెట్స్ పడగొట్టారు. జాక్ క్రాలే (73) టాప్ స్కోరర్. ఈ విజయంతో భారత్ ఐదు టెస్టుల సిరీస్‌న 1-1తో సమం చేసింది.

ఛేదనలో బాజ్‌బాల్‌తో చెల‌రేగాల‌నుకున్న ఇంగ్లండ్ బ్యాట‌ర్ల‌కు భారత బౌల‌ర్లు క‌ళ్లెం వేశారు. ఓవ‌ర్‌నైట్ స్కోర్‌ 67/1తో నాలుగో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ ఆదిలోనే వికెట్ కోల్పోయింది. నైట్ వాచ్‌మ‌న్ రెహాన్ అహ్మ‌ద్‌ (23)ను అక్ష‌ర్ ప‌టేల్ ఔట్ చేశాడు. అనంతరం ఓలీ పోప్‌ (36), జో రూట్‌ (16)లను పెవిలియన్ చేర్చిన రవిచంద్రన్ అశ్విన్ ఇంగ్లీష్ జ‌ట్టును కోలుకోలేని దెబ్బ‌కొట్టాడు. నిదానంగా ఆడుతున్న ఓపెనర్ జాక్ క్రాలే (73)ను కుల్దీప్ యాద‌వ్ ఎల్బీగా ఔట్ చేశాడు. ఇక లంచ్‌కు ముందు జానీ బెయిర్‌స్టో (26)ను జస్ప్రీత్ బుమ్రా ఎల్బీగా ఔట్ చేసి.. ఇంగ్లండ్‌ను ఓట‌మి అంచుల్లోకి నెట్టాడు.

Also Read: Shreyas Iyer: బ్యాట్‌తో విఫలమైనా.. ఫీల్డింగ్‌లో అదరగొట్టిన శ్రేయాస్ అయ్యర్!

లంచ్ అనంతరం టెయిలెండ‌ర్ల‌తో క‌లిసి పోరాడ‌తాడ‌నుకున్న‌ కెప్టెన్ బెన్ స్టోక్స్ (11) ర‌నౌట్‌గా వెనుదిరిగాడు. అయితే టామ్ హార్ట్‌లీ (36), బెన్ ఫోక్స్ (36)లు క్రీజులో పాతుకుపోయారు. దాంతో భారత బౌలర్లు వికెట్ కోసం చాలా శ్రమించారు. ప్రమాదకరంగా (64.6వ ఓవర్) మారుతున్న ఫోక్స్.. బుమ్రాకు రిటర్న్ క్యాచ్‌ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో 275 పరుగుల వద్ద ఇంగ్లండ్ 8వ వికెట్‌ను కోల్పోయింది. కాసేపటికి షోయబ్ బషీర్ (0)ను ముకేశ్‌ కుమార్‌ ఔట్‌ చేశాడు. ఆపై హార్ట్‌లీని బుమ్రా క్లీన్‌ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ కథ ముగిసింది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 396, రెండో ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 253 రన్స్‌ చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 292 పరుగులకు ఆలౌట్ అయింది.