Crime: కేవలం ఒకే ఒక ప్రశ్న.. ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అది కూడా బస్సు ఏ రూటుకు వెళ్తుందన్న చిన్న సందేహం అడిగినందుకు ఓ వృద్ధుడిని చంపేశాడో యువకుడు. తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు జిల్లా తాంబరంలో జరిగిన ఈ దారుణం అందరినీ షాక్కు గురిచేస్తోంది. ఒకసారి చెప్పినా మళ్లీ అడిగారన్న కోపంతో, వృద్ధుడని కూడా చూడకుండా గొంతు నులిమి చంపేశాడు అమర్నాథ్ అనే నిందితుడు. తాంబరం ప్రాంతానికి చెందిన చంద్రశేఖరన్ (72) ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నారు. ఉదయం వడపళనికి వెళ్లేందుకు తాంబరం శానిటోరియం వద్ద 70-జి నంబరు బస్సు ఎక్కారు. అదే సమయంలో అమర్నాథ్ అనే యువకుడు కూడా బస్సు ఎక్కి చంద్రశేఖరన్ పక్క సీటులో కూర్చున్నాడు. బస్సు ఎక్కడికి వెళ్తుందని చంద్రశేఖరన్ పక్కనే ఉన్న అమర్నాథ్ను అడిగారు. ఆ బస్సు వడపళనికి వెళ్తుందని అమర్నాథ్ సమాధానం ఇచ్చాడు.
Read Also: Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
అయితే, వృద్ధాప్యం వల్ల చంద్రశేఖర్ మళ్లీ అదే ప్రశ్న అడిగారు. దీంతో అమర్నాథ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. కోపంతో ఊగిపోయిన అమర్నాథ్ వృద్ధుడిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తోటి ప్రయాణికులు వారించినా వినకుండా, చంద్రశేఖరన్ గొంతు నులిమేశాడు. దీంతో ఆయన బస్సులోనే కుప్పకూలిపోయారు. బాధితుడిని వెంటనే క్రోంపేట ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఘటన తర్వాత బస్సు నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడు అమర్నాథ్ను ప్రయాణికులు వెంబడించి పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేవలం రూట్ అడిగినందుకే ఇంతటి దారుణానికి ఒడిగట్టడం స్థానికంగా కలకలం రేపింది.
