హైదరాబాద్, చెన్నై నగరాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిర్వహించిన సోదాల్లో కెటమైన్ డ్రగ్స్ అక్రమ రవాణా, మనీలాండరింగ్ నెట్వర్క్ వెలుగులోకి వచ్చింది. 2019లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ విచారణ ప్రారంభించింది. బెంగళూరులో జె. కన్నన్ వద్ద 26.75 కిలోల కెటమైన్, శివరాజ్ ఉర్స్ నిర్వహిస్తున్న రహస్య ల్యాబ్లో మరో 25.45 కిలోల డ్రగ్స్ను గతంలో స్వాధీనం చేసుకున్నారు.
ఈ అక్రమ తయారీకి హైదరాబాద్ కేంద్రంగా సహాయం అందించినట్లు ఈడీ గుర్తించింది. హైదరాబాద్లోని ఇన్కెమ్ లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్లో ఆర్అండ్డీ ఇన్ఛార్జ్గా పనిచేసిన పుట్టా వెంకటేశ్వర్లు, కెటమైన్ తయారీకి కావలసిన ముడిసరుకుతో పాటు సాంకేతిక సమాచారాన్ని శివరాజ్ ఉర్స్కు అందించారు. జె. కన్నన్, శివరాజ్ ఉర్స్, పుట్టా వెంకటేశ్వర్లు ముఠాగా ఏర్పడి కెటమైన్ను రహస్యంగా తయారు చేస్తూ విక్రయాలు జరిపారు.
ఈ అక్రమ వ్యాపారం ద్వారా వచ్చిన కోట్లాది రూపాయలను నగదు, హవాలా మార్గాల్లో తరలించి రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వివిధ సంస్థలు, పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు అధికారులు గుర్తించారు. PMLA నిబంధనల ప్రకారం చేపట్టిన ఈ సోదాల్లో రూ.82.82 లక్షల భారతీయ కరెన్సీ, 18,000 అమెరికన్ డాలర్ల విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు కీలక దస్తావేజులు, ఆర్థిక లావాదేవీల రికార్డులు, డిజిటల్ పరికరాలను కూడా సీజ్ చేసి విశ్లేషిస్తున్నారు. ఆస్తుల కొనుగోళ్లు, అక్రమ నిధుల మూలాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

