జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. బీజేపీ కార్యకర్తల్లారా.. జూబ్లీహిల్స్ ఎన్నిక ఓడిపోగానే కుంగిపోవద్దని, భవిష్యత్తు మనదే అని అన్నారు. ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం సహజమే అని పేర్కొన్నారు. తెలంగాణలో డివిజన్ పాలిటిక్స్ తో అధికారంలోకి రాలేమని.. కులం, మతం పునాది మీద రాజకీయాలు శాశ్వతంగా నడవవన్నారు. గెలిచినా, ఓడినా.. అధికారం ఉన్నా, లేకపోయినా దశాబ్దాలుగా కాషాయ జండా పట్టుకుని ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నారు. వేలాది మంది బీజేపీ కారకర్తలు, వందల మంది నాయకుల భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నా.. సీఎం, మంత్రులు, కొంతమంది అవగాహన లేని నాయకులు మాట్లాడుతున్న మాటలు వింటున్నా అని ఎంపీ ఈటల చెప్పారు.
‘నారాయణఖేడ్, పాలేరు హుజూర్నగర్, నాగార్జున సాగర్, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ అన్నిటిలో అధికార పార్టీ గెలిచింది. కేసీఆర్ అహంకారం అణచడానికి దుబ్బాకలో బీజేపీని గెలిపించారు. అన్యాయానికి న్యాయానికి.. ఆత్మగౌరవానికి అహంకారానికి.. ధర్మానికి అధర్మానికి జరిగిన హుజురాబాద్ ఎన్నికల్లో ధర్మం గెలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ ఆ ఎన్నిక కోసం ఎదురుచూశారు. స్వయంగా కేసీఆర్ వచ్చి దళిత బంధు ప్రకటించినా గెలవలేకపోయారు. తెలంగాణ వచ్చిన తరువాత 9 ఉప ఎన్నికలు జరిగితే.. 7 సార్లు అధికార పార్టీనే గెలిచింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో గెలిచింది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అధికార పార్టీ అనేక ప్రలోభాలు పెట్టీ మరీ గెలిచారు. కేసీఆర్ ఎన్ని చేశారో వీరు కూడా అవే చేశారు. కాంగ్రెస్ పార్టీకి హుజురాబాద్ లో వచ్చిన ఓట్లు 3016. దుబ్బాకలో, మునుగోడు డిపాజిట్ కోల్పోయింది. మరి డిపాజిటు కోల్పోయిన పార్టీ మొన్న ఎలా అధికారంలోకి వచ్చింది. ఒక్క బై ఎలక్షన్ ఓడిపోగానే బీజేపీ పని అయిపోతుందా?. రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారు ఎవరూ అలా మాట్లాడరు’ అని ఎంపీ ఈటల అన్నారు.
Also Read: Enumamula Market: బోసిపోయిన ఎనుమాముల వ్యవసాయ మార్కెట్.. అష్టకష్టాలు పడుతున్న అన్నదాతలు!
‘బీహార్ ఎన్నికలు ఒక ప్రభంజనం. ఒళ్ళు వంచి పని చేస్తే విజయం మనదే. కార్యకర్తలు, నాయకులు సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు చూసి బాధపడకండి. భవిష్యత్తు మనదే. జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితం అందరం బాధ్యత తీసుకుంటున్నాం.ప్రజలకు సేవ చేయడం వల్లనే దేశ వ్యాప్తంగా బీజేపీకి ప్రజలు ఓట్లు వేస్తున్నారు. గెలిస్తే బీజేపీ వాళ్ళు ఈవీఎంలను ఏదో చేశారని అంటున్నారు. మరి జూబ్లీహిల్స్ ఎన్నికలో ఈవీఎం మేనేజ్ చేశారా?, దొంగ ఓట్లు నమోదు చేయించారా?. తెలంగాణలో, కర్ణాటకలో కూడా మీరే గెలిచారు, మరి అక్కడ కూడా అలానే చేశారా?. మీరు గెలిస్తే ఒక న్యాయం.. మేము గెలిస్తే ఓట్ చోరీ అని అంటారా?. ఏం చేస్తావో ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలి, ఇలాంటి ఆరోపణలు కాదు. బరిగీసి కొట్లాడే తత్వం లేనప్పుడు పార్టీ ముందుకు పోయే అవకాశం లేదు. అధికార పార్టీ హంగుల వల్ల ఉపఎన్నికల్లో గెలుస్తుంది. పార్టీ అంటే నాయకులు అందరూ బాధ్యత తీసుకుంటారు. కిషన్ రెడ్డి గారినో, ఇంకొకరినో బాధ్యులు చెయ్యలేం. జూబ్లీహిల్స్ లో ఎమ్మెల్యే చనిపోయిన వెంటనే బీజేపీ తిరిగి ఉంటే ఫలితం వేరుగా ఉండేది. ఒకాయన అధికారం పోతుందని, ఇంకొకరు సానుభూతితో పోటీ పడ్డారు. నా వ్యక్తిగత అభిప్రాయం.. తెలంగాణలో డివిజన్ పాలిటిక్స్ తో అధికారంలోకి రాలేము. బీహార్లో మాకు ఇన్ని సీట్లు వచ్చాయి అంటే అందరి మద్దతు ఉంది. ట్రిపుల్ తలాక్ లాంటివి పని చేసాయి. మా సర్ సంగ్ చాలక్ ఒక గొప్ప మాట చెప్పారు.. ఒక జాతిని విస్మరించి దేశాన్ని నిర్మాణం చేయలేమని చెప్పారు. మోడీ గారు ప్రధాని కాగానే ఒక మెసేజ్ ఇచ్చారు. ప్రజలకు ఇప్పటి వరకు ఏం చేసావు, ఇక ముందు ఏం చేస్తావు అని చెప్పి ప్రజలను ఓట్లు అడగాలి’ అని ఎంపీ ఈటల చెప్పారు.