తూర్పుగోదావరి జిల్లాలోని రంగంపేట మండల పరిధిలో వడిశలేరు-రంగంపేట మధ్య మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణ పనులు ముగించుకుని స్వగ్రామాలకు తిరిగి వస్తున్న కార్మికులు ప్రయాణిస్తున్న టాటా ఏస్ వాహనం టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ విషాద ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఎనిమిది మంది గాయపడ్డారు.
కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం పిఠాపురం మండలంలోని మల్లాం, జల్లూరు గ్రామాలకు చెందిన 11 మంది కార్మికులు బాపట్ల జిల్లా కొల్లూరు ప్రాంతానికి నిర్మాణ పనుల నిమిత్తం వెళ్లారు. రెడీమిక్స్ వాల్స్ నిర్మాణ పనులు పూర్తి చేసుకుని మిగిలిన సామగ్రితో కలిసి స్వగ్రామాలకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో వాహనం టైర్ పంక్చర్ కావడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి వాహనం రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సామర్లకోటకు చెందిన మసకపల్లి బాబు, మురమర్ల రాజు, కాకడ రాజు అనే ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ఎనిమిది మంది స్వల్ప గాయాలతో బయటపడగా.. వారిని 108 అంబులెన్స్ల సాయంతో పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో అరగంటలో తమ గమ్యస్థానాలకు చేరుకునే సమయంలో ఈ విషాదం చోటుచేసుకోవడం కుటుంబ సభ్యులను విషాదంలో ముంచెత్తింది. సమాచారం అందుకున్న రంగంపేట పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో మృతుల స్వగ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

