ఈస్ట్ జోన్, సౌత్ జోన్ జట్ల మధ్య ప్రారంభమైన దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ మ్యాచ్లో ఈస్ట్ జోన్ పటిష్టమైన స్థితిలో నిలిచింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఈస్ట్ జోన్, తొలి ఇన్నింగ్స్లో 163 ఓవర్లలో 708 పరుగుల భారీ స్కోరు సాధించి ఆలౌటైంది. ఈస్ట్ జోన్ సాధించిన ఈ భారీ స్కోరులో కెప్టెన్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ ప్రధాన హైలైట్గా నిలిచింది.
కెప్టెన్ బాధ్యతలతో క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ ప్రత్యర్థి బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ డబుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. అతను కేవలం 334 బంతుల్లో 30 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో ఏకంగా 270 పరుగులు చేసి అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపిస్తూ సౌత్ జోన్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. ఇషాన్ కిషన్ ఇతర బ్యాటర్లతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి ఈస్ట్ జోన్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
ముఖ్యంగా కుమార్ కుషాగ్రతో కలిసి ఐదో వికెట్కు ఏకంగా 230 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు కొండంత కొండంత అండగా నిలిచాడు. అలాగే అనుకూల్ రాయ్తో కలిసి ఆరో వికెట్కు 140 పరుగులను జోడించి జట్టు స్కోరును 600 దాటించడంలో కీలక పాత్ర పోషించాడు. చివరకు త్రిపురాణ విజయ్ బౌలింగ్లో స్మరన్ రవిచంద్రన్కు క్యాచ్ ఇచ్చి కిషన్ వెనుదిరిగాడు.
ఈస్ట్ జోన్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్ (270) తో పాటు కుమార్ కుషాగ్ర (101) సెంచరీ సాధించగా, ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (72), వైభవ్ సూర్యవంశీ (44), అలాగే షికార్ మోహన్ (85), అనుకూల్ రాయ్ (45) పర్వాలేదనిపించారు. సౌత్ జోన్ బౌలర్లలో త్రిపురాణ విజయ్ 4 వికెట్లు తీసుకోగా, శ్రేయస్ గోపాల్, చామ మిలింద్ చెరో 2 వికెట్లు, మహమ్మద్ సిరాజ్, షేక్ రషీద్ చెరో వికెట్ పడగొట్టారు. ఇషాన్ కిషన్ విధ్వంసకర ద్విశతకంతో ఈస్ట్ జోన్ మ్యాచ్లో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది.

