DSP Bhim Reddy Arrest: అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్పీ భీమ్ రెడ్డిని అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే 200 కోట్ల రూపాయలకు పైగా విలువైన అక్రమాస్తులను గుర్తించినట్లు ఏసీబీ వెల్లడించింది. భీమ్ రెడ్డికి సంబంధించిన ఆస్తులపై నిర్వహించిన సోదాలు, విచారణల అనంతరం ఈ కీలక చర్య చేపట్టినట్లు సమాచారం.
ఇంతకుముందు భీమ్ రెడ్డి అనారోగ్య కారణాలను చూపడంతో ఆయనను వెంటనే అరెస్ట్ చేయకుండా ఏసీబీ నోటీసులు జారీ చేసింది. అయితే, ఆయనపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ అరెస్ట్ చేయడంలో జాప్యం జరగడంతో ఏసీబీ తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజా అరెస్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది. అరెస్ట్ అనంతరం భీమ్ రెడ్డికి హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ఆయనను ఏసీబీ కార్యాలయం నుంచి ప్రత్యేక భద్రత మధ్య తరలించారు.
ప్రస్తుతం భీమ్ రెడ్డిని జడ్జి నివాసం ముందు హాజరుపరచేందుకు ఏసీబీ అధికారులు తీసుకెళ్తున్నారు. మరికొద్దిసేపట్లో ఆయనను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

