మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన సంచలన ఫ్రాంచైజీ ‘దృశ్యం’. ఈ సిరీస్లో రాబోతున్న మూడవ భాగం ‘దృశ్యం 3’ కోసం ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 2న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. అందుకు సంబంధించి అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఈ సినిమా విడుదల నిరవధికంగా వాయిదా వేశారు
Also Read : Box Office : ధురంధర్ – 2 దాటికి విలవిలలాడిన ఉస్తాద్ భగత్ సింగ్
ప్రస్తుతం పశ్చిమ ఆసియా దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు మరియు యుద్ధ వాతావరణం ఈ వాయిదాకు ప్రధాన కారణమని తెలుస్తోంది. మలయాళ చిత్రాలకు గల్ఫ్ దేశాలు అతిపెద్ద మార్కెట్. అక్కడ నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల వల్ల సినిమా వసూళ్లపై భారీ ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే, రిస్క్ తీసుకోకుండా సినిమాను వాయిదా వేయడమే ఉత్తమమని నిర్మాతలు భావించారు. ఈ వాయిదాపై చిత్ర నిర్మాణ సంస్థ నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇప్పటికే ప్రమోషన్లు ప్రారంభించినప్పటికీ, అకస్మాత్తుగా ఎదురైన ఈ అంతర్జాతీయ సంక్షోభం వల్ల రిలీజ్ డేట్ను మార్చక తప్పలేదు. ఏప్రిల్ 2వ తేదీన కాకుండా మళ్ళీ పరిస్థితులు చక్కబడ్డాక కొత్త తేదీని ప్రకటించే అవకాశం ఉంది. జార్జికుట్టి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈసారి ఎలాంటి ఎత్తుగడలు వేయబోతున్నాడనే ఆసక్తి అందరిలోనూ ఉంది. అయితే సినిమా బిజినెస్ మరియు అంతర్జాతీయ మార్కెట్ను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనని ట్రేడ్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.
