Site icon NTV Telugu

DD News: దూరదర్శన్ లోగో కలర్ మార్పుపై విమర్శలు.. మాజీ సీఈవో ఏమన్నారంటే..!

Lok

Lok

దూరదర్శన్ లోగో కలర్ మార్పుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం లోగో కలర్ మారుస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన చేసింది. మొన్నటిదాకా ఎరుపు రంగులో ఉన్న డీడీ లోగోను.. తాజాగా కాషాయ రంగులోకి మారుస్తూ డీడీ యాజమాన్యం ఏప్రిల్ 16న నిర్ణయం తీసుకుంది.

అయితే లోగో మార్పుపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, డీడీ న్యూస్ మాజీ సీఈవో జవహర్ సిర్కార్ తప్పుపట్టారు. ఇది అనుచితమైన చర్యగా అభివర్ణించారు. స్వయంప్రతిపత్తి కలిగిన పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్‌ను కాషాయ రంగులోకి కలర్ మార్చడం సరి కాదని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు కాషాయ రంగులోకి డీడీ లోగోను మార్చడం బాధ కలిగిస్తోందని చెప్పారు. ఎన్నికల సమయంలో కలర్ మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది అని నిలదీశారు. ఇది ప్రసార భారతి కాదని.. ఇది ప్రచార భారతి అని జవహర్ సిర్కార్ సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. ఎన్నికల సమయంలో లోగో కలర్ మార్చడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని ఆయన తెలిపారు. ప్రస్తుత సీఈవో తీరును ఆయన తప్పుపట్టారు. సిర్కార్ 2012 నుంచి 2016 వరకు దూరదర్శన్.. ఆల్ ఇండియా రేడియోకు సీఈవోగా పని చేశారు.

ఇది కూడా చదవండి: Chocolates: కాలం చెల్లిన చాక్లెట్లు తిని రక్తం కక్కుకున్న పసిబిడ్డ..

డీడీ న్యూస్ కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలో నడుస్తుంది. మొన్నటిదాకా ఎరుపు రంగులో ఉండే డీడీ లోగోను.. ఇప్పుడు కాషాయ రంగులోకి మారుస్తూ డీడీ యాజమాన్యం ఏప్రిల్ 16న నిర్ణయించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటనలో తెలియజేసింది. మునుపెన్నడూ లేని విధంగా వార్తల ప్రయాణానికి సిద్ధంగా ఉండాలని తెలిపింది. సరికొత్త DD వార్తలను మీ ముందుకు తెస్తున్నామని పేర్కొంది. మాకు ధైర్యం ఉంది… వేగంపై కచ్చితత్వం, ఆరోపణలపై వాస్తవాలు, సంచలన నిజాలు ప్రజల ముందుకు తెస్తామని డీడీ న్యూస్ ఓ పోస్ట్‌లో వెల్లడించింది. ఈ మేరకు కొత్త రూపాన్ని సోషల్ వీడియో ద్వారా చూపించింది.

ఇది కూడా చదవండి: 5G Network: ఈ చిన్న చిట్కాతో మీ స్మార్ట్‌ఫోన్‌లో 5G నెట్వర్క్ సమస్యను ఇట్లే సాల్వ్ చేసుకోండి..

దూరదర్శన్ 1959 సెప్టెంబర్ 15న ప్రారంభమైంది. 1965లో దూరదర్శన్ న్యూ ఢిల్లీ వార్తలను ప్రసారం చేసింది. 1975 నాటికి డీడీ సేవలను ముంబై, అమృత్‌సర్ సహా ఏడు నగరాలకు విస్తరించింది. 1976 ఏప్రిల్ 1న ఇది సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలోని ప్రత్యేక విభాగం కిందకు వచ్చింది. 1982లో దూరదర్శన్ నేషనల్ బ్రాడ్‌కాస్టర్ అయింది. 1982లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడంతో దూరదర్శన్ కలర్ వెర్షన్ ప్రారంభమైంది. ఆ తర్వాత ఢిల్లీలో 1982 ఆసియా క్రీడలు కలర్ టెలికాస్ట్ జరిగింది. ప్రస్తుతం దూరదర్శన్ 6 జాతీయ ఛానెల్‌లు, 17 ప్రాంతీయ ఛానెల్‌లను కలిగి ఉంది. జాతీయ ఛానెల్‌లలో DD నేషనల్, ఇండియా, కిసాన్, స్పోర్ట్స్, ఉర్దూ, భారతి ఉన్నాయి. మరోవైపు DD అరుణ్‌ప్రభ, బంగ్లా, బీహార్, చందన, గిర్నార్, మధ్యప్రదేశ్, మలయాళం, నార్త్ ఈస్ట్, ఒడియా, పొధిగై, పంజాబీ, రాజస్థాన్, సహ్యగిరి, సప్తగిరి, ఉత్తర ప్రదేశ్, యాదగిరి, కాశీర్ అనే ప్రాంతీయ ఛానల్‌లను కలిగి ఉంది.

 

Exit mobile version