కుటుంబ కలహాలు ఉసురు తీస్తున్నాయి. నిత్యం గొడవల కారణంగా.. కాపురాల్లో కల్లోలం రేగుతోంది. కారణాలు ఏవైనా కానీ.. భర్త లేదా భార్య మాత్రం కాపురాల్లో జరుగుతున్న గొడవలను తట్టుకోలేక.. బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అంతే కాదు.. ఇలాంటి ఘటనల్లో అప్పుడప్పుడు వారికి పుట్టిన పిల్లలు కూడా సమిధలుగా మారుతున్నారు. తాజాగా హైదరాబాద్ కీసరలో ఓ వైద్యుడు కూడా భార్య వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు. అటు శ్రీకాకుళం జిల్లాలో ఓ మహిళ.. కుటుంబ కలహాల కారణంగా ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసింది.
భర్త అంటేనే భరించేవాడంటారు !! పాపం ఈ భర్తకి అంత కష్టమేం వచ్చిందో !! ఇంట్లో నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు వెళ్లి తన కారులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. కారులో విగతజీవిలా పడి ఉన్న ఇతని పేరు డాక్టర్ జోసెఫ్ వినోద్ కుమార్. మేడ్చల్ మండలం కీసర పరిధి.. అహ్మద్ గూడలో ఉంటున్నాడు. గత కొంతకాలంగా భార్య వీణాపాణితో విభేదాలు వచ్చాయి. భార్య భర్త మధ్య కుటుంబ కలహాలు మొదలయ్యాయి. తరుచూ గొడవపడేవాళ్లని తెలుస్తోంది. ఈ క్రమంలో వీణాపాణి మార్చి 31న భర్త జోసెఫ్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు జోసెఫ్ను పిలిచి విచారించారు… స్పాట్…
భార్య చేసిన పనివల్ల తాను పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాల్సి వచ్చిందని.. మనస్థాపానికి గురయ్యాడు జోసెఫ్. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఇంట్లో నుంచి తన కారు తీసుకుని ఔటర్ రింగ్ రోడ్డు వైపు వెళ్లాడు. వెళ్తూ… భార్యకి తన లైవ్ లొకేషన్ షేర్ చేశాడు. ఔటర్ రింగ్ రోడ్డులో కారును పక్కకు ఆపి.. తన వెంట తెచ్చుకున్న ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో పనుల్లో నిమగ్నమైన భార్య.. ఆలస్యంగా భర్త చేసిన మెసేజ్ చూసుకుంది. లైవ్ లొకేషన్ మాత్రమే పంపడంతో భార్యకి అనుమానం వచ్చింది. భర్తకి కాల్ చేస్తే.. కాల్ ఆన్సర్ చేయడం లేదు. దీంతో… భర్త షేర్ చేసిన లొకేషన్ను చేరుకుంది భార్య. అప్పటికే జోసెఫ్ చనిపోయి ఉన్నాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని జోసెఫ్ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. కారులో లభించిన ఇంజక్షన్, నీడిల్ స్వాధీనం చేసుకున్నారు. స్వతహాగా డాక్టర్ కావడంతో… ఇంజక్షన్ ద్వారా ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. జోసెఫ్ తీసుకున్న ఇంజక్షన్ ఏంటి? అనే వివరాలు రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలుస్తాయంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కీసర పోలీసులు. బంధువులు, స్థానికుల వివరాల ప్రకారం.. భార్యతో విభేదాల కారణంగానే జోసెఫ్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు.
Also Read:Shell India: వాహనదారులకు షెల్ ఇండియా షాక్.. డీజిల్ ధర రూ. 25, పెట్రోల్ ధర రూ. 7.41 పెంపు
మరోవైపు కుటుంబ కలహాలు శ్రీకాకుళం జిల్లాలో ఓ మహిళ ఉసురు తీశాయి. నరసన్నపేట మండలంలో ట్రైన్ కింద పడి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆమెతోపాటు ఉన్న ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. మృతురాలిని శ్రీకాకుళం జిల్లా బొంతల కోడూరు గ్రామానికి చెందిన కొత్తపల్లి జ్యోతిగా గుర్తించారు. భార్యాభర్తల మధ్య విభేదాల వల్లే ఇద్దరు పిల్లలతో సహా ట్రైన్ కింద పడినట్లు తెలుస్తోంది. కంబకాయ రైల్వే ట్రాక్పై ఈ ఘటన జరిగింది. ఇద్దరు కుమారులు హేమంత్, పునీత్కు ఒకరి ఎడమ కాలు పాదం మరొకరికి కుడికాలు పాదానికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
