Site icon NTV Telugu

KCR Nutrition Kits: నేటి నుంచే కేసీఆర్ పౌష్టికాహార కిట్ల పంపిణీ షురూ..

Kcr Nutrition Kits

Kcr Nutrition Kits

KCR Nutrition Kits: తల్లీపిల్లల సంరక్షణకు పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో నూతన పథకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కేసీఆర్‌ కిట్‌ పథకం విజయవంతంగా అమలవుతుండగా.. కొత్తగా ‘కేసీఆర్‌ పౌష్టికాహార కిట్ల’ను రూపొందించింది. గర్భిణుల్లో రక్తహీనత అత్యధికంగా ఉన్న తొమ్మిది జిల్లాల్లో తొలి విడతగా వీటిని పంపిణీ చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు నేటి నుంచి కిట్లు పంపిణీ చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది. దాదాపు 50 కోట్లతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా సుమారు 1.25 లక్షల మంది గర్భిణీలకు లబ్ధి చేకూరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయా జిల్లాలకు న్యూట్రిషన్ కిట్​లను పంపిన సర్కారు.. నేడు స్థానిక మంత్రుల ఆధ్వర్యంలో గర్భిణీలకు కిట్ లను అందించేందుకు సన్నాహాలు పూర్తి చేసింది.

రక్తహీనత ఎక్కువగా నమోదవుతున్న ఆదిలాబాద్‌, భ‌ద్రాద్రి కొత్తగూడెం, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, జోగులాంబ గ‌ద్వాల్‌, కామారెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్‌, ములుగు, నాగ‌ర్ క‌ర్నూల్‌, వికారాబాద్‌ల‌లో బుధవారం కిట్ల పంపిణీ చేపట్టనుంది. ఆయా జిల్లాల్లో స్థానిక మంత్రులు, ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా కేసీఆర్‌ పోష్టికాహార కిట్‌ల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని కామారెడ్డి కలెక్టరేట్ నుంచి సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డితో కలిసి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు వర్చువల్‌గా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. గర్భిణీల కోసం రూపొందించిన ఒక్కో కిట్ విలువల 1962 రూపాయలు కాగా… ఒక్కో కిట్‌లో ఒక కిలో న్యూట్రిషన్ మిక్స్ పౌడర్, ఒక కేజీ ఖర్జూర, 3 ఐరన్ సిరప్ బాటిళ్లు, 500 గ్రాముల నెయ్యి, ఆల్‌బెండ‌జోల్ టాబ్లెట్‌, ఒక కప్పుని ప్లాస్టిక్ బాస్కెట్ లో పెట్టి అందించనున్నారు.

Delhi Liquor Scam: ఈడీ ఛార్జిషీట్‌లో ఎమ్మెల్సీ కవిత పేరు

ఆదిలాబాద్‌లో గర్భిణీలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కిట్లను పంపిణీ చేయనున్నారు. కుమురంభీం జిల్లాలో కిట్ల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌ పాల్గొననున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్ హౌజ్‌లో కేసిఆర్ న్యూట్రీషన్ కిట్ల పంపిణీ రాష్ట్ర స్థాయి కార్యక్రమం ప్రారంభోత్సవంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పాల్గొననున్నారు. గర్భిణీలకు పోషకాహారం అందించి రక్తహీనతను తగ్గించడం, హీమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచడమే కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్ల లక్ష్యం. ప్రాథమికంగా 9 జిల్లాల్లో కిట్ల పంపిణీ చేపట్టినప్పటికీ భవిష్యత్‌లో అన్ని జిల్లాలకు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం విస్తరించనుంది.

Exit mobile version