NTV Telugu Site icon

Ponnam Prabhakar : గోషామహల్‌లోని లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ పట్టాల పంపిణీ

Ponnam Prabhakar

Ponnam Prabhakar

హైదరాబాద్ కలెక్టరేట్‌లో గోషామహల్ నియోజకవర్గంలోని లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాజా సింగ్, గణేష్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అర్హులైన లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. 144 మంది లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేశారు. మేడ్చల్ జిల్లాలోని రాంపల్లిలో ఉన్న డబుల్ బెడ్ రూమ్స్ కేటాయించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. దీపావళి పండగ కొత్త ఇంట్లో జరుపుకునేలా పండగకు ముందే ఇళ్లు ఇస్తున్నామన్నారు. రాంపల్లి డబుల్ బెడ్ రూమ్స్ లో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని, మనకు వచ్చిన ఇంటిని, ఇంటి పరిసరాలను మంచిగా ఉంచుకోవాలన్నారు. ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వబోతున్నామని, మూసీ పై రాజకీయ నాయకులు అనవసరంగా విమర్శలు చేస్తున్నారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. మూసీ రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేసింది గత ప్రభుత్వమే కదా.. అక్కడున్న పేద వాళ్ళని అక్కడే వదిలేస్తారా అని ఆయన వ్యాఖ్యానించారు. మూసీ లో ఉండే పేద ప్రజలకు ప్రత్యామ్నాయ ఇళ్లు, విద్య, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, అన్ని వర్గాల వారికి ఇబ్బందులు లేకుండా ఈ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొస్తున్నామన్నారు మంత్రి పొన్నం. తెలంగాణ ఏర్పాటు అయినపుడు మిగులు బడ్జెట్ తో అధికారం ఇస్తే.. ఇప్పుడు 7 లక్షల కోట్ల అప్పు చేసి వెళ్ళిపోయారని, తెలంగాణ ఉద్యమంలో శవాల పైన పేలాలు ఏరుకొని శవ రాజకీయాలు చేశారన్నారు. బాధ్యతగల ప్రతిపక్షంగా సూచనలు చేయాలి గాని.. విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Gaddam Prasad: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న స్పీకర్.. బలగం సినిమా ఫేమ్ కు ఆర్థిక సహాయం!

అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ప్రభుత్వ పక్షాన 144 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి దూర దృష్టి ఉంది. పేద వాడి కన్నీరు తుడవడమే మా ప్రభుత్వ లక్ష్యం. ఈ నెలాఖరుకి ప్రతీ నియోజకవర్గానికి మొదటి విడతగా పార్టీలకు అతీతంగా 3500 నుంచి 4 వేల వరకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతున్నాం. ఇది మొదటి విడత మాత్రమే.. రాబోయే రోజుల్లో అర్హులైన పేద వాళ్ళందరికీ ఇళ్లు ఇవ్వడమే మా లక్ష్యం. రాబోయే రోజుల్లో పేదలకు 20 లక్షల ఇళ్లు కట్టి ఇస్తాం. కేంద్ర సహకారం కూడా కోరుతున్నాం. దశాబ్దాల కొద్ది మూసీ లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
మూసీ బెడ్ లో నివసించే వారికి మంచి జీవితం ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీన్ని కూడా ప్రతిపక్షాలు వక్రీకరిస్తున్నారు. గత పదేళ్ళలో వాళ్ళు చేయలేని పనులు మేము చేస్తుంటే… ప్రధాన ప్రతిపక్షం చిల్లర వేషాలు వేస్తుంది. మూసీ లో ఉన్నవారికి అన్ని వసతులతో ఇళ్లు, జీవనోపాధి కల్పిస్తున్నాం. మూసీ లో ఉండే పిల్లలను వారికి నచ్చిన స్కూల్స్ లో చేర్పిస్తున్నం. గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే వాటా ను తెచ్చుకోవడంతో విఫలమైంది. పెయిడ్ ఆర్టిస్తులను తీసుకొచ్చి యూట్యూబ్ ల ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారు.’ అని వ్యాఖ్యానించారు.

Health: దాల్చిన చెక్కతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!

ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడుతూ.. ‘నా నియోజకవర్గ ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వడం ఆనందంగా ఉంది. వీళ్ళకి గతంలో ఇళ్లు సాంక్షన్ అయినా కూడా అప్పట్లో పట్టాలు ఇవ్వలేదు. కలెక్టర్ పట్టుబట్టి మీకు ప్రస్తుతం ఇళ్లు ఇస్తున్నారు. ఇళ్లు లేని వారికి ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇళ్లు లేని వారందరికీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. నా నియోజకవర్గంలో ఉన్న నా ఓటర్లంతా వేరే చోటుకు వెళ్తున్నారని భాధ ఉన్నా.. మీ అందరికీ ఇళ్లు వచ్చాయని సంతోషంగా ఉంది.’ అని ఆయన అన్నారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ.. అన్ని వసతులు ఉన్న రాంపల్లి లో లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్స్ ఇళ్లు ఇస్తున్నాం. ఇందులో 9 మంది దివ్యాంగులు ఉన్నారు.. వీరికి గ్రౌండ్ ఫ్లోర్,ఫస్ట్ ఫ్లోర్ లో ఇళ్లు ఇస్తున్నామన్నారు.