Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు.. రూ.152.95 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన!

  • ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి భారీ ఆధునీకరణ
  • రూ.152.95 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన
  • గోదావరి డెల్టా అభివృద్ధి చరిత్రలో మరో మైలురాయి
Dhavaleswaram Barrage

Dhavaleswaram Barrage

గోదావరి డెల్టాకు జీవనాడిగా నిలిచిన ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ ఆధునీకరణకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా నిరంతర వినియోగంలో ఉన్న ఈ కీలక జలవనరుల నిర్మాణానికి సమగ్ర మరమ్మత్తులు, ఆధునీకరణ పనులు చేపట్టేందుకు రూ.152.95 కోట్ల అనుమతులు మంజూరు చేశారు. ఈ పనులకు సీఎం చంద్రబాబు సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని పిచ్చుకలంక వద్ద గేట్ నంబర్-1 వద్ద శంకుస్థాపన చేయనున్నారు.

1847లో సర్ ఆర్థర్ కాటన్ ప్రారంభించి.. 1852లో పూర్తి చేసిన ధవళేశ్వరం ఆనకట్ట గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించేలా చేసి డెల్టా ప్రాంతాన్ని దేశంలోనే అత్యంత సారవంతమైన వ్యవసాయ ప్రాంతంగా మార్చింది. అనంతరం వరదల ప్రభావం, పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని 1969లో ఆధునిక సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ నిర్మాణం ప్రారంభమై 1984లో పూర్తయింది. ప్రస్తుతం 5.837 కిలోమీటర్ల పొడవున్న ఈ బ్యారేజీ ద్వారా సుమారు 10.13 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. అంతేకాకుండా లక్షలాది మంది ప్రజలకు తాగునీటి ప్రధాన వనరుగా, వరద నియంత్రణలో కీలక వ్యవస్థగా ఇది సేవలందిస్తోంది.

నాలుగు దశాబ్దాలుగా భారీ వరదల ఒత్తిడి, యాంత్రిక భాగాల శిథిలీకరణ కారణంగా బ్యారేజీ ఆధునీకరణ అవసరమని కేంద్ర జల సంఘం, డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్, హైడ్రో-మెకానికల్ నిపుణుల కమిటీలు సూచించాయి. ఈ సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా ఆధునీకరణ పనులు చేపడుతోంది. ఇప్పటికే 2014-15లో తొలి దశలో 175 వరద గేట్లలో 58 గేట్లను రూ.31.77 కోట్ల వ్యయంతో మార్చగా.. ఇప్పుడు మిగిలిన 117 గేట్లను అత్యాధునిక సాంకేతికతతో భర్తీ చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 175 గేట్లకు కొత్త రబ్బర్ సీల్స్, రోలర్ అసెంబ్లీలు, వైర్ రోపులు, మాస్టర్ కంట్రోల్ ప్యానెల్స్, విద్యుత్ కేబుళ్ల మార్పిడి, శాండ్ బ్లాస్టింగ్, పెయింటింగ్ వంటి సమగ్ర పనులు నిర్వహించనున్నారు. హైదరాబాద్‌కు చెందిన బీఈకేఈఎం ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఈ పనులు అప్పగించగా.. రెండేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ ఆధునీకరణ పూర్తయిన తర్వాత బ్యారేజీ భద్రత మరింత బలోపేతం కావడంతో పాటు వరద నిర్వహణ సామర్థ్యం కూడా గణనీయంగా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల రైతులు, మత్స్యకారులు, గ్రామీణ ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరనుంది. సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన చారిత్రాత్మక జలవనరుల వారసత్వాన్ని పరిరక్షిస్తూ.. ఆధునిక సాంకేతికతతో భవిష్యత్ తరాలకు మరింత సురక్షితమైన సాగునీటి వ్యవస్థను అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు గోదావరి డెల్టా అభివృద్ధి చరిత్రలో మరో కీలక మైలురాయిగా నిలుస్తుందని ఇరిగేషన్ శాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.