Dhavaleswaram Barrage Flood Update: తూర్పుగోదావరి జిల్లాలోని ధవలేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. బ్యారేజీ వద్ద నీటిమట్టం రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి 14.90 అడుగులకు చేరింది. దీంతో అధికారులు అప్రమత్తంగా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ధవలేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి 14 లక్షల 40 వేల 381 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం కారణంగా బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్యారేజీ వద్ద నీటిమట్టం 17.75 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. అయితే ఎగువన ఉన్న భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా తగ్గుముఖం పడుతున్నందున, ధవలేశ్వరం వద్ద వరద మట్టం స్వల్పంగా పెరిగిన తర్వాత క్రమంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.
భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం తగ్గుముఖం పట్టింది. 2 గంటల నుంచి 4 గంటల వరకు 0.5 అడుగులు తగ్గింది. మీటర్లలో 0.27 మీటర్లు తగ్గింది. వాతావరణం మేఘావృతం నుంచి వర్షం, అనంతరం జల్లులుగా మారింది. ప్రస్తుతం నీటి మట్టం ప్రమాద స్థాయి కంటే తక్కువగా ఉండి తగ్గుతున్న ధోరణిలో ఉంది. భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రభావం క్రమంగా తగ్గుతోంది. అయితే దిగువ ప్రాంతాలపై ప్రభావం కొనసాగవచ్చునని అధికారులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.

