తెలంగాణ శాసనసభలో భూ సమస్యలు, నిషేధిత భూముల జాబితా (22A) , ధరణి పోర్టల్ లోపాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్రమైన ప్రకటన చేశారు. భూములకు సంబంధించిన ఏ రకమైన సమస్య ఉన్నా పరిష్కరించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇదే సమయంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు, ధరణి బాధితులకు , పట్టణ ప్రాంత ప్రజలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలను సీఎం సభ దృష్టికి తీసుకువచ్చారు.
ఇందిరమ్మ ఇండ్లకు ఐదేళ్ల లాకింగ్ పీరియడ్
ప్రభుత్వ భూమిలో ఇందిరమ్మ ఇండ్లు పొందిన లబ్ధిదారులకు ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయం తీసుకుందని సీఎం తెలిపారు. నిబంధనల ప్రకారం ఐదేళ్ల లాకింగ్ పీరియడ్ ముగిసిన తర్వాత ఆ ఆస్తులను అమ్ముకునే వెసులుబాటును కల్పిస్తున్నట్లు ప్రకటించారు. రిజిస్ట్రేషన్ రుసుముతో పాటు వర్తించే నాలా ఫీజు చెల్లిస్తే వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
ధరణి నిషేధిత జాబితాలో భారీగా తగ్గిన భూములు
గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు 2025లో కలెక్టర్ల నుండి సేకరించిన జాబితా ఆధారంగా భూములను నిషేధిత జాబితాలో చేర్చినట్లు సీఎం వివరించారు. ఒకే సర్వే నంబర్ పరిధిలో సగం ప్రభుత్వ భూమి, సగం ప్రైవేట్ భూమి ఉన్న సందర్భాల్లో రిజిస్ట్రార్లు , రెవెన్యూ అధికారుల మధ్య స్పష్టత లేక ఇబ్బందులు ఎదురయ్యాయని పేర్కొన్నారు. ధరణి పోర్టల్ ప్రారంభంలో 7 లక్షల ఎకరాలకు పైగా భూములు నిషేధిత జాబితాలో ఉండగా, ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల 2026 నాటికి ఆ సంఖ్య 3 లక్షల ఎకరాల కంటే దిగువకు తగ్గిందని వెల్లడించారు.
హరీష్ రావు వ్యాఖ్యలపై సీఎం రేవంత్ చురకలు
సభలో ప్రతిపక్ష నేత హరీష్ రావు లేవనెత్తిన అంశాలపై సీఎం స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ఇల్లు నిషేధిత జాబితాలో ఉంటే దానిని తొలగించారని హరీష్ రావు చెబుతున్నారని, అసలు హరీష్ రావుకు ఏం కావాలో స్పష్టత ఉందా అని ప్రశ్నించారు. ఇల్లు నిషేధిత జాబితాలోనే ఉండాలా లేక తొలగించాలా అని నిలదీశారు. సీఎం ఆస్తికే ఇబ్బంది కలిగించే పరిస్థితి వస్తే మంత్రి ఎలా కొనసాగుతారని వ్యాఖ్యానించిన సీఎం, ప్రతిపక్షాల వైఖరిపై విమర్శలు గుప్పించారు.
పట్టణ భూ క్రమబద్ధీకరణపై త్వరలోనే నూతన పాలసీ
రాష్ట్రంలో భూ సమస్యలపై ప్రభుత్వం 12 కీలక అంశాలను గుర్తించిందని రేవంత్ రెడ్డి తెలిపారు. పట్టణ భూముల క్రమబద్ధీకరణపై త్వరలోనే సమగ్రమైన నూతన పాలసీని తీసుకువస్తామని ప్రకటించారు. భూముల రిజిస్ట్రేషన్ , క్రమబద్ధీకరణ ప్రక్రియలను ఏకకాలంలోనే పూర్తి చేస్తామని చెప్పారు. అధీకృత లే అవుట్లకు సంబంధించి సంబంధిత అథారిటీలతో విచారణ జరిపి వారం రోజుల్లో కొత్త మార్గదర్శకాలు (గైడ్లైన్స్) జారీ చేస్తామని హామీ ఇచ్చారు.
సింగరేణి బాధితులకు కమిటీ.. ఎల్బీ నగర్ వాసులకు శుభవార్త
సింగరేణి ప్రాంతంలో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు. సింగరేణి యాజమాన్యం , కార్మిక సంఘాల నాయకులు కలిసి కూర్చొని సమస్యను త్వరితగతిన పరిష్కరించుకోవాలని సూచించారు. మరోవైపు GO 118 కింద ఉన్న పెండింగ్ దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉందని, ఆ నియోజకవర్గ ప్రజలకు త్వరలోనే శుభవార్త అందుతుందని, వీలైనంత త్వరగా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.

