Tirumala: శ్రీవారి మెట్టు మార్గంలో భక్తుడికి అస్వస్థత.. చికిత్స పొందుతూ మృతి!

  • శ్రీవారి మెట్టు మార్గంలో భక్తుడికి అస్వస్థత
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భక్తుడు మృతి
  • తిరుమల భక్తుల కారు పల్టీ
Srivari Mettu Footpath

Srivari Mettu Footpath

తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో ఓ భక్తుడు అస్వస్థతకు గురయ్యాడు. మంగళవారం ఉదయం 200వ మెట్టు వద్ద గుండెపోటుతో కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు వెంటనే చంద్రగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భక్తుడు మృతి చెందాడు. మృతి చెందిన భక్తుడు రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన వెంకటేశ్ (50)గా గుర్తించారు. తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. వెంకటేశ్ మృతితో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

కావలి మండలం రుద్రకోట జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తిరుమల నుంచి వస్తున్న భక్తుల కారు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో 11 మందికి గాయాలు అయ్యాయి. నరసరావుపేటకు చెందిన 11 మంది తిరుమల శ్రీవారి దర్శనం కోసం సోమవారం కారులో తిరుమలకు చేరుకున్నారు. స్వామివారిని దర్శనం అనంతరం తిరుగు ప్రయాణం అయ్యారు. మంగళవారం తెల్లవారుజామున రుద్రకోట వద్ద ప్రమాదానికి గురైంది. అందరూ నిద్రలో ఉండగా ప్రమాదవశాత్తూ కారు బోల్తా కొట్టింది. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.