NTV Telugu Site icon

Hydrogen Powered Car: ఇది కదా కారంటే..? రూ.150 ఖర్చు చేస్తే.. 300 కిలోమీటర్లు వెళ్లొచ్చు..

Hydrogen Powered Car

Hydrogen Powered Car

Hydrogen Powered Car: మార్కెట్‌లోకి ఎన్నో రకాల కార్లు వస్తున్నాయి.. పెట్రోల్‌, డీజిల్‌తో పాటు ఈవీ కార్లు, హైడ్రోజన్‌తో నడిచే కార్లు కూడా ఉన్నాయి.. కానీ, ఏ కారు మెయిటెన్‌ చేయాలన్నా ఖర్చుతో కూడుకున్న పని.. పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు పెరిగిపోవడంతో.. కొందరు కారు ఉన్నా.. దానిని బయటకు తీయాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి.. మరోవైపు.. యువతరం కొత్త కొత్త ఆవిష్కరణలతో మార్కెట్‌లోకి వస్తుంది.. చాలా తక్కువ ఖర్చుతో ఓ కారును రూపొందించాడు ఓ రైతు బిడ్డ.. గత ఏడాది మహారాష్ట్రలోని చంద్రపూర్‌కు చెందిన రైతు బిడ్డ ‘హర్షల్ నక్షనేని’ హైడ్రోజన్‌తో నడిచే కారును రూపొందించి అందరి చేత ప్రశంసలందుకున్నాడు. అయితే, తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఆ కారును పరిశీలించారు.. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి..

తక్కువ ధరకే అధిక మైలేజీని అందిస్తున్న ఈ కారు చూడడానికి ఆకర్షణీయంగా ఉండేలా ప్రత్యేకమైన డిజైన్ ను కలిగి ఉంది. ఇంత గొప్ప కారును తయారు చేసిన నక్షనేనిని.. దేవేంద్ర ఫడ్నవీస్ అభినందించారు. అంతే కాకుండా ఆయనను కలవడం ఆనందంగా ఉందని సోషల్‌ మీడియాలో వెల్లడించారు.. ఆకుపచ్చ రంగులో కనిపించే ఈ కారు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా పనిచేసే ‘సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్’ను పొందిందని హర్షల్ వివరించారు. ఇది ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉంది. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్‌లో వైరల్ అవుతోంది. ఇందులో కారు తనంతట తానుగా ముందుకు వెళ్తుంది.. ఈ హైడ్రోజన్ కారును తయారు చేసేందుకు హర్షల్ నక్షనేయ్ దాదాపు రూ. 25 లక్షలు ఖర్చు చేసినట్లు ఆయన వెల్లడించారు. కేవలం రూ.150కే హైడ్రోజన్‌ను ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 300 కిలోమీటర్ల రేంజ్‌ను ఈ కారు అందిస్తుందన్నారు.

ఇక, ఆ కారులో ఫెరారీని తలపించే డోర్స్‌ మరియు సన్‌రూఫ్ మరింత ప్రత్యేకంగా కనిపిస్తాయి. గ్రీన్ కలర్ హోమ్ మేడ్ హైడ్రోజన్ కారు ఇంకా ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంది, కాబట్టి ఖచ్చితమైన లాంచ్ డేట్ వెల్లడించలేదు. అంతే కాకుండా, ఈ కారుకు సంబంధించిన మరిన్ని స్పెసిఫికేషన్స్ ఇంకా తెలియాల్సి ఉంది.. హర్షల్ నక్షన్ అద్భుత సృష్టి అందరినీ ఆకట్టుకుంటున్నప్పటికీ.. భారతదేశంలో అమలులో ఉన్న మోటారు వాహనాల చట్టం ప్రకారం, ఇటువంటి వాటిని పబ్లిక్ రోడ్లపై ఉపయోగించడం ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే భారతదేశంలో, వాహనం తప్పనిసరిగా ‘ARAI’ (ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా)చే ధృవీకరించబడాలి.

మన దేశంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిబంధనలను ప్రవేశపెడుతున్నాయి. కాబట్టి పబ్లిక్ రోడ్లపైకి వాహనం రావాలంటే సంబంధిత అధికారుల నుండి అనుమతి పొందాలి. లేకపోతే ఇవి ప్రాజెక్ట్ కార్లుగా పరిగణించబడతాయి మరియు రేసింగ్ ట్రాక్‌లు లేదా ఫామ్‌హౌస్‌ల వంటి ప్రైవేట్ ప్రాపర్టీలకు పరిమితం చేయబడతాయి. పబ్లిక్ రోడ్లపై ఇలాంటి వాహనాలు కనిపిస్తే పట్టుకునే అధికారం పోలీసులకు ఉంటుంది. అయితే, భవిష్యత్‌లో ఇలాంటి కార్లకు అనుమతి వస్తుందోమే వేచి చూడాల్సి ఉంది.. ఏదేమైనా రైతు బిడ్డ.. ఆలోచన అభినందనీయం.. ఇలాంటి కార్లు మార్కెట్‌లోకి వస్తే.. తక్కువ ఖర్చుతోనే ప్రయాణం సాగించే వెసులుబాటు ఉంటుంది.