Flight Break Fail: ఢిల్లీ నుండి సిమ్లాకు బయలుదేరిన విమానం సోమవారం (మార్చి 24) జుబ్బల్హట్టి విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. విమానం ఉదయం 8:20 గంటలకు సిమ్లా జుబ్బల్హటికి చేరుకోగా.. పైలట్ ల్యాండింగ్ కోసం అత్యవసర బ్రేకులు వేయాల్సి వచ్చింది. ఘటన తర్వాత విమానంలో ప్రయాణీకులు దాదాపు 30 నిమిషాల పాటు విమానంలోనే చిక్కుకుపోయారు. ఇక ఇదే సమయంలో హిమాచల్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం ముఖేష్ అగ్నిహోత్రి కూడా అదే విమానంలో ఢిల్లీ నుండి సిమ్లాకు తిరిగి వస్తున్నారు. ఆయనతోపాటు ఆ రాష్ట్ర డీజీపీ కూడా అదే విమానంలో ప్రయాణిస్తున్నారు. సోమవారం ఉదయం సిమ్లా విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో ఢిల్లీ నుండి సిమ్లా వెళ్తున్న అలయన్స్ ఎయిర్ విమానం నంబర్ 91821 బ్రేక్లలో సాంకేతిక లోపం తలెత్తినట్లు సమాచారం.
Read Also: MPs Salary hike: ఎంపీల జీతాలను పెంచిన కేంద్రం.. ఎంతపెరిగిందంటే?
సిమ్లాలోని జుబ్బర్హట్టి విమానాశ్రయ పరిపాలన అత్యవసర ల్యాండింగ్కు సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ నుండి సిమ్లాకు బయలుదేరిన అలయన్స్ ఎయిర్ విమానం నంబర్ 91821 సోమవారం ఉదయం సిమ్లా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయిందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ల్యాండింగ్ సమయంలో, రన్వేపై విమానం బ్రేక్లలో సాంకేతిక లోపం ఏర్పడడంతో.. పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి తెలియజేసి అత్యవసర ల్యాండింగ్ (సిమ్లా విమానాశ్రయంలో) చేయాలని నిర్ణయించుకున్నాడని తెలిపింది. పైలట్ ఈ విషయం గురించి ప్రయాణికులందరినీ అప్రమత్తం చేసి, వారి సీట్లను గట్టిగా పట్టుకోమని కోరాడు. దీని తరువాత పైలట్ అత్యవసర బ్రేక్లను ఉపయోగించి విమానాన్ని సగం రన్వేపై ఆపినట్లు పేర్కొన్నారు.