H1N1: ఢిల్లీలో స్వైన్ ఫ్లూ టెన్షన్.. గతేడాదితో పోల్చితే 8 రెట్లు పెరిగిన కేసులు..

H1n1

H1n1

ఢిల్లీలో స్వైన్ ఫ్లూ (H1N1) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఆగస్టు 20 నాటికి 1,777 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ తెలిపింది. గత ఏడాది ఇదే సమయంలో సుమారు 200 H1N1 కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం ఆ కేసుల సంఖ్య 8 రెట్లు పెరిగాయి. అపోలో, మ్యాక్స్ వంటి ప్రముఖ ఆసుపత్రుల వద్ద రోగుల సంఖ్య పెరిగింది. ప్రతీ 20 మంది ఓపిడి రోగులలో దాదాపు 15 మందికి స్వైన్ ఫ్లూ పాజిటివ్‌గా తేలుతోందని వైద్యులు పేర్కొంటున్నారు. వైరస్ జెనెటిక్ మ్యుటేషన్ లేదా ప్రజల మధ్య సంబంధాలు పెరగడం వల్ల ఈ తీవ్రత ఉండి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

ఇది ముక్కు, గొంతు, ఊపిరితిత్తులపై ప్రభావం చూపే ఇన్‌ఫ్లుయెంజా ‘ఎ’ రకానికి చెందిన వైరల్ ఇన్ఫెక్షన్. జ్వరం, దగ్గు, తలనొప్పి, కండరాల నొప్పులు, తీవ్ర అలసట, చలి దీని ప్రధాన లక్షణాలు. చాలామంది రోగులు సాధారణ చికిత్సతో కోలుకుంటున్నప్పటికీ, కొంతమందిలో న్యుమోనియా, ఆక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ARDS) వంటి కాంప్లికేషన్లు వస్తున్నాయి. ముఖ్యంగా డయాబెటిస్, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు, వృద్ధులు, గర్భిణులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఎక్కువ ప్రమాదంలో ఉంటారు.

ఈ వ్యాధి నిర్ధారణకు ఆర్‌టీ-పీసీఆర్‌ (RT-PCR) లేదా రాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేస్తున్నారు. దీని నివారణకు ఆసెల్టామివిర్ అనే యాంటీవైరల్ ఔషధం బాగా పనిచేస్తుంది. లక్షణాలు ప్రారంభమైన మొదటి 48 గంటల్లో ఈ మందు వాడటం మంచిది. యాంటీబయోటిక్స్ వాడకూడదని, కేవలం పారాసిటమాల్ వాడుతూ త్వరగా వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏటా ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధకత పెరుగుతుంది. అక్టోబర్ నెల వ్యాక్సిన్ తీసుకోవడానికి ఉత్తమమైన సమయంగా వైద్యులు చెబుతున్నారు. కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని హెచ్చరిస్తున్నారు.