Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: ఢిల్లీలోని మాలవీయ నగర్ హోటల్లో సంభవించిన ఘోర అగ్నిప్రమాద ఉదంతం దేశరాజధానిని తీవ్రంగా కలచివేసింది. 21 మంది ప్రాణాలను బలితీసుకుని, మరో 28 మందిని ఆసుపత్రి పాలు చేసిన ఈ దారుణ ఘటనపై ఢిల్లీ పోలీసులు తమ దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఈ ప్రమాదానికి కారణమైన వారిని పట్టుకునే క్రమంలో తాజాగా శనివారం నాడు హోటల్ వంటమనిషి కేశవ్ నేగి (65)ని పోలీసులు అరెస్ట్ చేశారు. దిల్షాద్ గార్డెన్కు చెందిన ఈయన నిర్లక్ష్యం వల్లే ఐదు అంతస్తుల భవనం చూస్తుండగానే అగ్నిఆహుతి అయిందని ప్రాథమిక విచారణలో తేలింది. జూన్ 3న మాలవీయ నగర్లోని హౌజ్ రాణి ప్రాంతంలో నడుస్తున్న ‘ఫ్లోరిష్ స్టే హోటల్’లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదం వెనుక హోటల్ యాజమాన్యం చేసిన బాగోతాలు, భద్రతా లోపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ విస్మయానికి గురిచేస్తున్నాయి. అసలు ఈ హోటల్కు ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి అనుమతులు (ఫైర్ ఎన్ఓసీ) లేవని అధికారులు గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో లోపల ఉన్నవారు బయటపడటానికి ఎలాంటి మార్గాలు లేకపోవడం మరణాల సంఖ్యను పెంచింది. భవనానికి కేవలం ఒకే ఒక ఎంట్రీ-ఎగ్జిట్ పాయింట్ ఉండటం, కిటికీలన్నీ శాశ్వతంగా మూసివేసి ఉంచడం, పైగా ప్రధాన ద్వారం సెన్సార్తో పనిచేసేది కావడం వల్ల ప్రమాదం జరగ్గానే కరెంట్ పోయి గేట్లు లాక్ అయిపోయాయి. దీంతో లోపల ఉన్నవారు ఊపిరాడక, బయటకు రాలేక అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. ఈ దారుణంలో మరణించిన 21 మందిలో పది మంది భారతీయులు కాగా, తొమ్మిది మంది ఆఫ్రికన్ దేశాలకు చెందినవారు, ఇద్దరు తుర్క్మెనిస్తాన్ పౌరులు ఉన్నారు.
హోటల్ యజమాని ఇల్లీగల్ దందాలు..
ఈ కేసుకు సంబంధించి హోటల్ యజమాని లవ్కేష్ బజాజ్ను పోలీసులు అంతకుముందే అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పరారైన బజాజ్ దంపతులపై పోలీసులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేసి, తీవ్రంగా గాలించి ఎట్టకేలకు పట్టుకున్నారు. ప్రస్తుతం సాకేత్ కోర్టు ఇతడికి నాలుగు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. బజాజ్పై హత్యకు సమానమైన నేరపూరిత నరహత్య, అగ్నిప్రమాదానికి కారణమవ్వడం, ఆస్తి నష్టం కలిగించడం, ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద విచారణ జరుపుతున్నారు. అయితే బజాజ్ కేవలం హోటల్ నిర్వహణలోనే కాకుండా, చట్టవ్యతిరేకమైన ఇతర దందాల్లోనూ ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలడం గమనార్హం. ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ (అక్రమ వలసలు) కేసులో సైతం బజాజ్ హస్తం ఉన్నట్లు బయటపడింది. బంగ్లాదేశ్కు చెందిన స్వీటీ సర్కార్, ఆమె కుమార్తె పుష్పో సర్కార్ అనే ఇద్దరు మహిళలు భారీగా డబ్బులు ఆశజూపడంతో బజాజ్ తన చత్తర్పూర్ నివాస విలాసాన్ని (అడ్రస్ను) వాడుకోవడానికి అనుమతించాడు. ఆ అడ్రస్ ఆధారంగానే సదరు బంగ్లాదేశీయులు నకిలీ భారతీయ గుర్తింపు పత్రాలను, పాస్పోర్టులను సంపాదించి ఢిల్లీలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు ఇప్పటికే బజాజ్తో పాటు ఆ ఇద్దరు బంగ్లాదేశ్ మహిళలను అరెస్ట్ చేసి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. మరోవైపు.. ఈ ఘోర ప్రమాదం నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం తక్షణ చర్యలకు ఉపక్రమించింది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నగరంలోని భవనాల ఫైర్ సేఫ్టీ నిబంధనలు, అనధికారిక నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ ఘోర విషాదానికి కారణమైన హోటల్ యజమానులైనా, వెనకుండి నడిపించిన అధికారులైనా సరే ఎవరినీ వదిలిపెట్టేది లేదని, బాధ్యులందరిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Also Read
- 12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
- Mudragada Funeral: ముద్రగడకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు!
తాజావార్తలు
-
SPIRIT : స్పిరిట్ కర్నాటక థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన టాలీవుడ్ నిర్మాత
-
RC 17 : దసరాకి రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభం!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
Murder Case: భార్యను కసితీరా చంపాడు.. 620కి.మీ ప్రయాణించి నాగపామును పట్టుకొచ్చి.. చివరికి..!
-
Chiru – Bobby : చిరంజీవి – బాబీ సినిమా మాస్ సాంగ్’కి పూనకాలే!
ట్రెండింగ్
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!