Cockroach Janata Party (CJP): ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP)కి చెందిన ఎక్స్ (X) ఖాతాను నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తమ పార్టీ అధికారిక ‘X’ ఖాతాను ఎలాంటి సరైన కారణం లేకుండా సస్పెండ్ చేశారని ఆరోపిస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్పై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ పురుషైంద్ర కుమార్ కౌరవ్ ధర్మాసనం ముందు ఈ కేసు విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది.. ఖాతా నిలిపివేత కారణంగా పార్టీ కార్యకలాపాలు, ప్రజలతో కమ్యూనికేషన్ దెబ్బతింటోందని వాదించారు. అయితే వెంటనే ‘X’ ఖాతాను పునరుద్ధరించాలన్న అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది.
ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి, ఎక్స్ సంస్థకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై వారి వివరణ కోరుతూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసుకు సంబంధించిన తదుపరి విచారణను జులై 7కు వాయిదా వేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. అప్పటిలోపల కేంద్రం, ఎక్స్ సంస్థ తమ సమాధానాలు సమర్పించాలని కోర్టు సూచించింది.
