Delhi CM Atishi: దేశ రాజధానిలోని రోడ్ల పరిస్థితులను ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి సోమవారం పరిశీలించారు. అనంతరం దీపావళి వరకు ఢిల్లీలో గుంతలు లేని రోడ్లను ప్రజలకు అందిస్తామని హామీ ఇచ్చారు. నేటి నుంచి వారం రోజులపాటు ఢిల్లీలోని 1400 కిలోమీటర్ల రోడ్లను ముఖ్యమంత్రి, మంత్రులు పరిశీలించనున్నారు. గుంతల రోడ్లను గుర్తించి మరమ్మతులు, రిపేర్లకు ఢిల్లీ సర్కార్ ఆదేశాలు ఇవ్వనుంది. దీనిలో భాగంగా దీపావళి నాటికి ఢిల్లీలో గుంతలు లేని రోడ్లను రెడీ చేస్తామని ఢిల్లీ సీఎం అతిషి చెబుతున్నారు. ఎన్ఎస్ఐసీ ఓఖ్లా, మోడీ మిల్ ఫ్లైఓవర్, చిరాగ్ ఢిల్లీ, తుగ్లకాబాద్ ఎక్స్టెన్షన్, మధుర రోడ్, ఆశ్రమ చౌక్ల రోడ్లను సీఎం అతిషి పరిశీలించారు. దీపావళి వరకు దెబ్బతిన్న అన్ని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పిడబ్ల్యుడి) రోడ్లను మరమ్మతు చేయడానికి అవసరమైన సూచనలు ఇచ్చారు.
Read Also: Ayushman Bharat: ఆయుష్మాన్ భారత్ నమోదుపై రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు
రోడ్ల పరిశీలన అనంతరం అతిషి మీడియాతో మాట్లాడుతూ.. రెండు రోజులుగా అరవింద్ కేజ్రీవాల్తో కలిసి ఢిల్లీలోని రోడ్లను పరిశీలించి.. రోడ్ల పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉందని… పార్టీ ఎమ్మెల్యేలందరికీ అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారని తెలిపారు. ఢిల్లీ రోడ్ల పునరుద్ధరణకు మంత్రులు కృషి చేయాలని సీఎం అతిషి సూచించారు. తాను దక్షిణ, ఆగ్నేయ ఢిల్లీలోని రోడ్ల బాధ్యతను తీసుకున్నానని ఆమె చెప్పారు. సౌరభ్ భరద్వాజ్ తూర్పు ఢిల్లీ రోడ్లను తనిఖీ చేయనున్నారని, గోపాల్ రాయ్ ఈశాన్య ఢిల్లీలోని రోడ్లను తనిఖీ చేస్తారని, ఇమ్రాన్ హుస్సేన్ సెంట్రల్ రోడ్లను తనిఖీ చేస్తారన్నారు. నైరుతి, ఔటర్ ఢిల్లీకి కైలాష్ గెహ్లాట్, వాయువ్య ఢిల్లీకి ముఖేష్ సెహ్రావత్ బాధ్యత వహిస్తారని సీఎం అతిషి తెలిపారు. దీపావళి నాటికి ఢిల్లీ ప్రజలకు గుంతలు లేని రహదారులను అందించడానికి తాము ప్రయత్నిస్తామన్నారు.
ఢిల్లీ ప్రభుత్వ రోడ్ అసెస్మెంట్, రిపేర్ ప్లాన్ ప్రకారం, 1,400 కి.మీ పొడవున్న పీడబ్ల్యుడి రోడ్లను ఒక వారం పరిశీలించిన తర్వాత, ఏ రోడ్లకు పూర్తి మరమ్మతు, పాక్షిక మరమ్మతులు అవసరం, ఏది పునర్నిర్మించాలో నిర్ణయించబడుతుంది. రోడ్ల పరిశీలన తర్వాత వారంలో మరమ్మతు పనులు ప్రారంభమవుతాయి. గత వారం ప్రారంభంలో, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రికి లేఖ అందజేశారు. నగరంలో దెబ్బతిన్న రోడ్లను బాగు చేయాలని అభ్యర్థించారు.పవర్ డిస్కమ్లు, ఢిల్లీ జల్బోర్డు చేపట్టిన పనుల వల్లే నగరంలో రోడ్లు దెబ్బతిన్నాయని, ఆ తర్వాత మరమ్మతులు చేపట్టలేదని ముఖ్యమంత్రి అన్నారు.