Convicts Escape : ఉరిశిక్ష పడిన ఇద్దరు కరడుకట్టిన ఉగ్రవాదులు కోర్టు ప్రాంగణంలోనే సినీ ఫక్కీలో తప్పించుకోవడం స్థానికంగా కలకలం సృష్టించింది. వారిని ఛేజ్ చేయడానికి అధికారుల పెద్ద టీం ఇప్పుడు బయలుదేరింది. అచ్చం సినిమాల్లో లాగే దుండగులు కోర్టునుంచి తరలిస్తున్న క్రమంలో తప్పించుకున్నారు. ఈ ఘటన బంగ్లాదేశ్ రాజధాని ఢాకా కోర్టు వద్ద జరిగింది. ప్రముఖ బంగ్లాదేశ్-అమెరికన్ బ్లాగర్ అవిజిత్ రాయ్, ఆయన పబ్లిషర్ ఫైజల్ అరెఫిన్ డిపన్ల హత్య కేసుల్లో అన్సురుల్లా బంగ్లా టీం ఉగ్రవాద సంస్థకు చెందిన మెయినుల్ హసన్ షమీమ్, అబు సిద్ధిఖ్ సోహెల్లకు గతేడాది కోర్టు మరణశిక్ష విధించింది. వేరే కేసుల్లోనూ నిందితులైన వీరిని విచారణ కోసం ఢాకా కోర్టుకు తీసుకొచ్చారు.
Read Also: BigBoss Neha Chowdary: పెళ్లి చేసుకోబోతున్న బిగ్ బాస్ బ్యూటీ… పెళ్లి కొడుకు ఎవరంటే
అనంతరం వారిని తిరిగి జైలుకు తరలించేందుకు తీసుకురాగా కోర్టు బయట అప్పటికే కొందరు బైకులపై వచ్చిన వ్యక్తులు ఎస్కార్టు పోలీసులపై కెమికల్ స్ప్రే చల్లి బైకులపై ఎక్కించుకుని వెళ్లారు. ఎస్కార్టు పోలీసులపై రసాయనాలు స్ప్రే చేయడంతో వారి కళ్లు బైర్లు కమ్మాయి. అంతే కాకుండా ఆ ప్రాంతం నిండా పొగ కమ్ముకుంది. ఖైదీలతో సహ వచ్చిన వారు వచ్చినంత వేగంగా అక్కడి నుంచి పరారయ్యారు. హై ప్రొఫైల్ హత్య కేసుల్లోని దోషులను సాధారణ ఖైదీల్లా ఇద్దరు ఎస్కార్ట్ పోలీసులతో కోర్టుకు పంపడం ఏంటని కోర్టు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖైదీల చేతులకు మాత్రమే సంకెళ్లు వేశారని అంటున్నారు. ఉగ్రవాదులు తప్పించుకోవడంతో దేశవ్యాప్తంగా రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్టు బంగ్లాదేశ్ హోం మంత్రి అసదుజమాన్ ఖాన్ కమల్ తెలిపారు. కాగా, ఉగ్రవాదులు ఫిబ్రవరి 2015లో అవిజిత్ రాయ్ను హతమార్చారు. అదే ఏడాది నవంబరులో డిపన్కు కూడా హత్యచేశారు.