NTV Telugu Site icon

Election Results: ఈసీ వెబ్‌సైట్‌లో డేటా అప్‌డేట్‌ చేయడం లేదు.. కాంగ్రెస్ అసహనం

Jai Ram Ramesh

Jai Ram Ramesh

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. తొలిదశలో వెనుకబడిన తర్వాత బీజేపీ పునరాగమనం చేసి ట్రెండ్స్‌లో మెజారిటీ సంఖ్యను సాధించింది. ప్రస్తుతం.. బీజేపీ 39 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇదిలా ఉంటే.. హర్యానాలో ట్రెండ్‌లు మెల్లగా అప్‌డేట్ అవుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ బీజేపీ, ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో.. ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. ఈసీ వెబ్‌సైట్‌లో డేటా అప్‌డేట్‌ చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 9 మరియు 11 గంటల మధ్య ఈసీ వెబ్‌సైట్‌లో ఫలితాల అప్‌డేట్‌ లేదని, మందకొడిగా సాగుతోందని లేఖలో పేర్కొన్నారు. ‘లోక్‌సభ ఎన్నికల ఫలితాల సమయంలో మాదిరిగానే.. హర్యానా కౌంటింగ్ ఫలితాల సరళిని కూడా ఎప్పటికప్పుడు ఈసీ వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ చేయడంలో జాప్యం కనిపిస్తోంది. కాలం చెల్లిన, తప్పుదోవ పట్టించే ట్రెండ్స్‌ను షేర్ చేస్తూ యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చేలా బీజేపీ ప్రయత్నిస్తోందా..?ఈ అంశంపై ఇసికి ఫిర్యాదు చేశాం. మా ప్రశ్నలకు ఈసీ సమాధానమిస్తుందని ఆశిస్తున్నాం’ అని జైరాం రమేష్ పేర్కొన్నారు. ప్రజలు కాంగ్రెస్‌ పక్షాన ఉన్నా.. బీజేపీ మైండ్‌ గేమ్‌ ఆడుతుందని ఫైర్‌ అయ్యారు. అధికారులపై బీజేపీ ఒత్తిడి పెడుతోందని కాంగ్రెస్‌ ఆరోపణలు చేస్తోంది. మరోవైపు.. కాంగ్రెస్ ఆరోపణలపై ఈసీ స్పందించింది. అన్ని నియోజకవర్గాల్లో దాదాపు 25 రౌండ్ల కౌంటింగ్ ప్రతి ఐదు నిమిషాలకు అప్‌డేట్ అవుతుందని ఎన్నికల సంఘం తెలిపింది. బాధ్యతారహితమైన, నిరాధారమైన వ్యాఖ్యలను ఈసీ తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది.

Dhanush- Aishwarya: ఐశ్వర్య-ధనుష్‌ విడాకులు.. కోర్టుకు ఇద్దరూ డుమ్మా?

కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనెత్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు శుభవార్త వస్తుందని అన్నారు. “ఈ చిత్రం త్వరలో మారుతుంది. హర్యానా నుండి మాకు శుభవార్త వస్తుంది.. నేను ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ని చూస్తున్నాను. వెబ్‌సైట్‌లోని డేటా మారడం లేదు. మా ఓటు షేర్ బిజెపి కంటే చాలా ముందుంది. ఈ సీట్లు మారతాయి.” అని తెలిపారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ కూడా కాంగ్రెస్ గెలుస్తుందని అన్నారు. మీడియాతో మాట్లాడిన గెహ్లాట్, “అంతిమంగా కాంగ్రెస్ గెలుస్తుంది. ఇది భావజాల యుద్ధం, సరైన భావజాలం ఉన్న వ్యక్తులు గెలుస్తారు. భారతీయ జనతా పార్టీ నాయకులకు ప్రజలను ఎలా వేధించాలో మాత్రమే తెలుసు” అని అన్నారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు భూపిందర్ సింగ్ హుడా విశ్వాసం వ్యక్తం చేశారు. హర్యానాలో పార్టీ భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదని అన్నారు.

Srisailam Dam Safety: శ్రీశైలంలో ముగిసిన ప్రపంచ బ్యాంక్‌ ప్రతినిధుల పరిశీలన.. నవంబర్‌లో టెండర్లు..