Dadisetti Raja: కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. అత్యధిక మెజార్టీ లక్ష్యంగా దాడిశెట్టి కుటుంబ సభ్యులు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. భర్తకి అండగా నిలవాలని భార్య.. తండ్రిని భారీ మెజార్టీతో గెలిపించాలని కొడుకు ప్రచారంలో దూసుకుపోతున్నారు. వైసీపీ అభ్యర్థి, మంత్రి దాడిశెట్టి రాజా ఘన విజయం కోసం భార్య లక్ష్మీచైతన్య, కొడుకు శంకర్ మల్లిక్ ప్రచారంలో పాల్గొంటున్నారు.
తుని మండలం ఎస్.అన్నవరం పంచాయతీ పరిధిలోని రామకృష్ణ నగర్, జగన్నాథగిరి, గెడ్లబీడు గ్రామాలలో తల్లీకొడుకులు ఇద్దరూ కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లారు. లక్ష్మీచైతన్య, మల్లిక్ మాట్లాడుతూ.. తుని నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న మంత్రి దాడిశెట్టి రాజాని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి రాజాకి అఖండ విజయాన్ని అందించాలన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పథకాలు అందిస్తున్న సీఎం జగనన్నకు మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని అన్నారు. ఈ ప్రచారంలో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.