Safety Of Children: ఇటీవల కాలంలో పార్క్ చేసిన వాహనాల్లోకి అనుకోకుండా వెళ్ళిన పిల్లలు ఊపిరాడక మృతి చెందుతున్న సంఘటనలు ఆందోళనకు కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి సైబరాబాద్ పోలీస్ వారు పౌరులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే, విలువైన చిన్నారుల ప్రాణాలను రక్షించగలమని పోలీస్ శాఖ తెలిపింది. ఇందుకు సంబంధించిన కొన్ని సూచనలను పోలీసులు ప్రజలకు తెలిపారు.
Read Also: AP Govt: మనుషులకు ఆధార్ తరహాలో పశువులకు గోధార్.. ఏపీ ప్రభుత్వం కసరత్తు!
ముందుగా వాహనాన్ని లాక్ చేయకముందు వాహనంలో ఎవరైనా ఉన్నారా? అని పూర్తిగా తనిఖీ చేసుకోవాలి. ముందు, వెనుక సీట్లను గమనించి పరిశీలించుకోవాలి. అలాగే వాహనంలో లేదా వాహనం చుట్టుపక్కల పిల్లలను ఒంటరిగా వదిలివెళ్ళకూడదు. వాహన తాళాలను పిల్లలకు అందుబాటులో ఉంచకూడదు. అనుకోకుండా వాహనంలోకి వెళ్లి చిక్కుకుపోయే ప్రమాదం ఉందని తెలిపారు. వాహనాలు ఆడుకునే ప్రదేశాలు కాదని, పిల్లలకు స్పష్టంగా అర్థమయ్యేలా తెలియజేయాలని కోరారు. వాహనాల్లో ఒంటరిగా ప్రవేశించరాదని వారికి అర్థమయ్యేలా వివరించి చెప్పాలని పోలీసులు తెలిపారు.
వాహనాన్ని ఎప్పుడైనా లాక్ చేయేముందు మళ్లీ తనిఖీ చేయాలనీ, పిల్లలు లేదా పెంపుడు జంతువులు ఏమైనా లోపల ఉన్నాయో లేదో ఒకసారి పరిశీలించాలని తెలిపారు. వాహనం ఎక్కడ పార్క్ చేసినా (ఇంటి వద్ద అయినా సరే) తప్పకుండా లాక్ చేయాలి, తాళాలను పిల్లలకు అందుబాటులో ఉండకుండా భద్రపరచాలని తెలిపారు. “రియర్ సీట్ రిమైండర్”, “చైల్డ్ డిటెక్షన్ అలర్ట్” వంటి భద్రతా పరికరాలను వాహనాల్లో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వాహనాల విండోలకు బ్లాక్ ఫిల్ములు లేదా అధిక టింటింగ్ ఉపయోగించకూడదని, వాహనంలో ఎవరైనా ఉంటే గుర్తించలేని ప్రమాదం ఉందని తెలిపారు.
వాహనం వాడకంలో లేకపోయినప్పటికీ డోర్లు, విండోలను పూర్తిగా మూసి లాక్ చేయాలి. పిల్లలు కనిపించకుండా పోతే వాహనాల్లో, సమీప వాహనాల్లో పరిశీలించాలన్నారు. వేసవిలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నపుడు పార్క్ చేసిన వాహనాల చుట్టూ పిల్లలు ఆడుకుంటే తక్షణం జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ సూచనలు ప్రతి ఒక్కరూ పాటించాలని.. చిన్నారుల భద్రత మన చేతుల్లోనే ఉందని ప్రజా ప్రయోజనార్థం సైబరాబాద్ పోలీసులు పేర్కొన్నారు.