Cyber Fraud: సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతులతో ప్రజలను లక్ష్యంగా చేసుకుంటూ భారీ మోసాలకు పాల్పడుతున్నారు. ఫారెక్స్ ట్రేడింగ్లో అధిక లాభాలు, వాట్సాప్ ద్వారా వ్యాపార భాగస్వామి పేరుతో నకిలీ సందేశాలు, విదేశీ వ్యవసాయ భూముల్లో పెట్టుబడుల పేరుతో ముగ్గురు బాధితుల నుంచి రూ.2.10 కోట్లకు పైగా కాజేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ మూడు ఘటనలపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఫారెక్స్ ట్రేడింగ్ పేరుతో రూ.33 లక్షల స్వాహా:
కొండాపూర్కు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి సోషల్ మీడియాలో కనిపించిన ఫారెక్స్ ట్రేడింగ్ ప్రకటనను చూసి మోసగాళ్ల వలలో చిక్కుకున్నాడు. ప్రకటనలోని లింక్ ద్వారా వాట్సాప్ గ్రూపులో చేరిన బాధితుడికి అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. మొదట రూ.1 లక్ష పెట్టుబడి పెట్టించిన నిందితులు, తర్వాత నష్టాలు వచ్చాయని చెబుతూ మరిన్ని పెట్టుబడులు పెట్టించారు. ఈ క్రమంలో బాధితుడు మొత్తం రూ.40.30 లక్షలు వివిధ ఖాతాల్లో జమ చేశాడు. అయితే మోసగాళ్లు కేవలం రూ.7.30 లక్షలు మాత్రమే తిరిగి చెల్లించి, మిగిలిన రూ.33 లక్షలతో పరారయ్యారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వాట్సాప్ మెసేజ్తో రూ.67 లక్షల టోకరా:
గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న అకౌంటెంట్ను సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుని రూ.67 లక్షలు కాజేశారు. వ్యాపార భాగస్వామి పేరుతో కొత్త మొబైల్ నంబర్ నుంచి వాట్సాప్ సందేశం పంపిన మోసగాళ్లు, వాట్సాప్లో పూర్తి పేరు కనిపించేలా ఏర్పాటు చేసి అకౌంటెంట్లో నమ్మకం కల్పించారు. దీనితో జులై 16 నుంచి 22 మధ్య నిందితులు సూచించిన విధంగా వివిధ బ్యాంకు ఖాతాలకు మొత్తం రూ.67 లక్షలు బదిలీ చేశాడు. ఆ తర్వాత కూడా మరో రూ.25 లక్షలు పంపాలని జులై 25న సందేశం రావడంతో అనుమానం వచ్చిన బాధితుడు అసలు వ్యాపార భాగస్వామిని సంప్రదించాడు. దీంతో ఇది సైబర్ మోసమని గుర్తించి గచ్చిబౌలి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
వ్యవసాయ భూముల పేరుతో మోసం:
నల్లగండ్లకు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి రష్యాలో వ్యవసాయ భూముల్లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించి సైబర్ నేరగాళ్లు రూ.1.10 కోట్లు కాజేశారు. 100 ఎకరాల వ్యవసాయ భూమిలో పెట్టుబడి పెడితే కేవలం మూడు నెలల్లోనే రూ.27 లక్షల లాభం వస్తుందని ఆశ చూపిన నిందితులు, అవసరమైతే రష్యాకు కూడా తీసుకెళ్తామని చెప్పి బాధితుడిలో విశ్వాసం కల్పించారు. దశలవారీగా భారీ మొత్తాన్ని వసూలు చేసిన తర్వాత ఎలాంటి లాభాలు రాకపోవడంతో బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి బ్యాంకు ఖాతాలు, డిజిటల్ లావాదేవీలపై దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వరుస ఘటనల నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియా ప్రకటనలు, వాట్సాప్ సందేశాలు లేదా విదేశీ పెట్టుబడుల పేరుతో వచ్చే అధిక లాభాల ఆఫర్లను నమ్మి డబ్బులు బదిలీ చేయవద్దని హెచ్చరించారు. పెట్టుబడులు పెట్టే ముందు సంబంధిత సంస్థల విశ్వసనీయతను తప్పనిసరిగా ధ్రువీకరించుకోవాలని, అనుమానాస్పద లింకులు, కొత్త నంబర్ల నుంచి వచ్చే ఆర్థిక లావాదేవీల సూచనలను నిర్ధారించకుండా పాటించవద్దని సూచించారు. ఎలాంటి సైబర్ మోసం జరిగినా వెంటనే సమీప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లేదా జాతీయ సైబర్ హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు.

