CM Revanth: భవనాలు నిర్మించడం సులభమే.. కానీ, కలలకు పునాదులు వేయాలంటే సంకల్పం ఉండాలి..!

Cm Revanth

Cm Revanth

CM Revanth: తెలంగాణలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన స్ ప్లాట్ఫామ్ వేదికగా ఆయన.. భవనాలు నిర్మించడం సులభమేనని, అయితే విద్యార్థుల కలలకు పునాదులు వేయాలంటే ప్రభుత్వానికి సంకల్పం ఉండాలని అన్నారు. ఆ సంకల్పంతోనే తెలంగాణలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వేగంగా రూపుదిద్దుకుంటున్నాయని పేర్కొన్నారు.

ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా.. ఆర్థిక, సామాజిక అసమానతలకు ముగింపు పలకడంతో పాటు కులం, మతం, ప్రాంతం, కుటుంబ నేపథ్యం వంటి భేదాలను తొలగించి ప్రతి చిన్నారికి ప్రపంచ స్థాయి విద్యను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో అత్యాధునిక వసతులతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ విద్యాలయాలు పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారి భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తాయని పేర్కొన్నారు.

ఈ పాఠశాలలు పేద కుటుంబాల పిల్లలను రేపటి శాస్త్రవేత్తలు, పరిపాలకులు, పారిశ్రామికవేత్తలు, నవభారత నిర్మాతలుగా తీర్చిదిద్దే జ్ఞాన మందిరాలుగా నిలవబోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పేద పిల్లల కలలకు చిరునామాగా, తెలంగాణ మోడల్‌కు ప్రతీకగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిలుస్తాయని సీఎం పేర్కొన్నారు. ఈ పాఠశాలలు కేవలం విద్యను అందించే కేంద్రాలుగా కాకుండా, తరతరాల భవిష్యత్తును మార్చే సంస్థలుగా రూపుదిద్దుకుంటాయని రేవంత్ రెడ్డి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.