జలసౌధలో కొత్తగా నియమితులైన AEEలకు నియామక పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల భావోద్వేగం వ్యవసాయం, నీరు అని ఆయన అన్నారు. ఇది ఉద్యోగం కాదు.. ఇది భావోద్వేగమని ఆయన అన్నారు. ఇంజనీర్లు, అధికారులు క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లడం లేదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇంజనీర్లుగా ఈ ఉద్యోగం మీకు కేవలం ఉద్యోగం మాత్రమే కాదని.. తెలంగాణ ప్రజల భావోద్వేగం అని గుర్తుపెట్టుకొని పని చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో కట్టిన ప్రాజెక్టులు దశాబ్దాల కాలం నుండి చెక్కుచెదరకుండా ఉన్నాయని, ఇందుకు ఉదాహరణ నాగార్జున సాగర్ గా చెప్పుకోవచ్చన్నారు. కమీషన్ల కోసం, గొప్ప కోసం ఆగమేఘాల మీద కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కనీసం ఐదేళ్లు కూడా నిలవలేదని పేర్కొన్నారు. ఇంజనీర్లుగా ఎలాంటి తప్పులు చేయకూడదో, ఎలాంటి అవినీతి జరగకుండా చూడాలో మీకు ఇది ఒక కేస్ స్టడీలాగా ఉపయోగపడుతుందని తెలిపారు. నిజాయితీగా పని చేసేవారిని కాంగ్రెస్ ప్రభుత్వం నెత్తిన పెట్టుకుంటుందని.. ఎవరైనా పైరవీల కోసం వస్తే, అవినీతికి పాల్పడినట్టు తెలిస్తే తిండి కూడా సరిగ్గా దొరకని ప్రాంతాలకు ట్రాన్సఫర్ అవుతారని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.
Read Also : UP: ఎంతకు తెగించారు.. AIతో టీచర్ అశ్లీల ఫోటోలు సృష్టించి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్