CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో ఇండస్ట్రియల్ గ్రోత్ పెంచడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ఎంసీఆర్ హెచ్ ఆర్ డీ బోధి పెవిలియన్లో పరిశ్రమల శాఖపై సీఎం రేవంత్ రెడ్డి హైలెవల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్లో పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రామకృష్ణా రావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, టీజీఐఐసీ (TGIIC) వైస్ చైర్మన్ శశాంక, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ లో ల్యాండ్ అలాట్మెంట్, కొత్త పరిశ్రమల ఏర్పాటుపై సీఎం అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ను పూర్తి పర్యావరణ హితంగా, ‘నెట్ జీరో సిటీ’ (Net Zero City) తరహాలోనే డిజైన్ చేయాలని సీఎం స్పష్టం చేశారు. అక్కడ కల్పించే ఇన్ఫ్రాస్ట్రక్చర్ (మౌలిక వసతులు) అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని, ఇందులో ఎలాంటి రాజీ పడొద్దని అధికారులకు తేల్చి చెప్పారు. ఇందుకోసం ప్రపంచంలోని బెస్ట్ ఇంటర్నేషనల్ సిటీలను స్టడీ చేయాలని సూచించారు. మొదట ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా డెవలప్ చేసిన తర్వాతే కంపెనీలకు భూ కేటాయింపులు చేయాలని ఆదేశించారు. గ్లోబల్ లెవెల్ టాప్ ఆర్గనైజేషన్స్, కంపెనీలను ఫ్యూచర్ సిటీకి తీసుకురావడమే మన టార్గెట్ కావాలన్నారు. అలాగే ఈ ఫ్యూచర్ సిటీలో ప్రజా ప్రతినిధులు, సివిల్ సర్వీస్ ఆఫీసర్లు, జర్నలిస్టుల కోసం 500 ఎకరాలను కేటాయించనున్నట్లు సీఎం వెల్లడించారు.
రాష్ట్రంలోకి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ను ఆకర్షించడానికి ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ (Invest Telangana) పేరుతో ఒక స్పెషల్ సెల్ , ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనికోసం ఒక అట్రాక్టివ్ లోగో, వెబ్సైట్ను డిజైన్ చేయాలన్నారు. తెలంగాణకు వచ్చే ఇన్వెస్టర్లకు గైడెన్స్ ఇవ్వడానికి ఒక ‘ఎస్కార్ట్ ఆఫీసర్’ (Escort Officer) వ్యవస్థను తీసుకురావాలని, అవసరమైతే గ్రూప్ 1 స్థాయి అధికారిని దీనికోసం నియమించాలని సూచించారు. జూన్ కల్లా ఫ్యూచర్ సిటీ ఇండస్ట్రియల్ పార్క్లో పరిశ్రమల ఏర్పాటుకు శంకుస్థాపనలు జరగాలని, ల్యాండ్ అలాట్మెంట్ అయిన వెంటనే కంపెనీలు కన్స్ట్రక్షన్ మొదలుపెట్టేలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాలన్నారు. ఇండస్ట్రియల్ పాలసీలో బెస్ట్ రిజల్ట్స్ కోసం తమిళనాడు, గుజరాత్ పారిశ్రామిక విధానాలను కూడా ఒకసారి స్టడీ చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
