NTV Telugu Site icon

CM Revanth Reddy : కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌ సమీక్ష

Cm Revanth

Cm Revanth

కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికలో ఏమేం సిఫారసులున్నాయి.. ప్రభుత్వం తదుపరి చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి ఏ.రేవంత్రెడ్డి ఆరా తీశారు. శనివారం సాయంత్రం సచివాలయంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఆయన చర్చలు జరిపారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి సీఎం వెంట ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ కుంగిపోవటం, సుందిళ్ల బ్యారేజీకి బుంగలు పడటంతో తాత్కాలికంగా చేపట్టాల్సిన మరమ్మతులు, పునరుద్ధరణ చర్యలపై ఇటీవల ఎన్డీఎస్ఏ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇచ్చింది.

ఈ నివేదికలో ఉన్న ముఖ్యమైన అంశాలు, సిఫారసులన్నింటినీ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి సీఎంతో పాటు మంత్రులకు వివరించారు. 2019లోనే బ్యారేజీలకు ప్రమాదం ఉన్నట్లు తేలిందని, రిపేర్లు, పునరుద్ధరణ చర్యలు చేపట్టినా ప్రాజెక్టుకు ముప్పు ఉండదని తోసిపుచ్చలేమని ఎన్డీఎస్ఏ అందులో స్పష్టం చేసింది. మరో నెల రోజుల్లో వర్షాకాలం ప్రారంభమవుతున్నందున ఈలోగా తీసుకోవాల్సిన చర్యలపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చించాల్సి ఉంటుందని సీఎం అన్నారు. రిపేర్లు చేయాలా.. ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా.. మరింత నష్టం జరగకుండా ఏమేం చర్యలు చేపట్టాలనేది ఇరిగేషన్ విభాగం అధికారులతో కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.

శనివారం నాటి కేబినేట్ భేటీ జరుగకపోవటంతో ఈ కీలకమైన అంశాలపై చర్చించలేకపోయామని చెప్పారు. త్వరలోనే మేడిగడ్డ, సుందిళ్ల, అక్కడి పంప్ హౌస్లను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. ఎన్నికల కమిషన్ అనుమతి రానందున రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది.

శనివారం మధ్యాహ్నం కేబినేట్ సమావేశం నిర్వహించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కేబినేట్ సమావేశానికి ప్రభుత్వం ఈసీ అనుమతి కోరింది. కానీ శనివారం రాత్రి వరకు ఈసీ నుంచి అనుమతి రాలేదు. ఈసీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో ఈరోజు జరగాల్సిన కేబినేట్ భేటీ నిలిచిపోయింది. ఈసీ నుంచి ఏ క్షణమైన అనుమతి వస్తుందని మంత్రులు అందరూ శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సచివాలయంలో వేచి ఉన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు అన్ని విభాగాల అధికారులు కేబినేట్ భేటీకి హాజరయ్యేందుకు ఆఫీసులకు చేరుకున్నారు.

కానీ రాత్రి 7 గంటల వరకు ఈసీ నుంచి స్పందన లేకపోవటంతో కేబినేట్ భేటీ జరగలేదు. సీఎంతో పాటు మంత్రులు వెనుదిరిగి వెళ్లారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రైతులకు సంబంధించిన పలు కీలకమైన విషయాలపై ఈ భేటీలో చర్చించాలని ఎజెండా సిద్ధం చేసుకున్నారు. కానీ ఈసీ నుంచి స్పందన లేకపోవటంతో రైతుల సంక్షేమం, అత్యవసరమైన అంశాలపై చర్చించలేకపోయామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవం. అందుకు సంబంధించిన వేడుకల నిర్వహణతో పాటు పునర్విభజనకు పదేండ్లు పూర్తి కావటంతో ఇప్పటివరకు రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న అంశాలు, పునర్విభజన చట్టంలో పెండింగ్లో ఉన్న కీలకమైన అంశాలను కేబినేట్ భేటీలో చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కేబినేట్ భేటీ వాయిదా పడటంతో ఇవేవీ చర్చ జరగలేదు.

ఈసీ నుంచి అనుమతి ఎప్పుడు వస్తే.. అప్పుడే కేబినేట్ భేటీ జరపాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. సోమవారం లోపు ఈసీ నుంచి అనుమతి రాకపోతే, అవసరమైతే మంత్రులతో కలిసి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి అనుమతి కోరుతామని చెప్పారు.