NTV Telugu Site icon

Mamata Banerjee: కోల్‌కతా హైకోర్టు తీర్పుపై సీఎం సంచలన వ్యాఖ్యలు.. సవాల్ చేస్తామని ప్రకటన

Mse

Mse

సార్వత్రిక ఎన్నికల వేళ మమతాబెనర్జీ ప్రభుత్వానికి కలకత్తా హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగలింది. టీచర్ల రిక్రూట్‌మెంట్‌‌పై సోమవారం ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. 2016లో చేపట్టిన టీచర్ రిక్రూట్‌మెంట్‌ను న్యాయస్థానం రద్దు చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద షాకే తగలింది.

పశ్చిమ బెంగాల్‌లో 2016 టీచర్ రిక్రూట్‌మెంట్ ద్వారా నియమితులైన 26 వేల మంది ఉద్యోగాలను రద్దు చేస్తూ కోల్‌కతా హైకోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ఉపాధ్యాయ నియామక ప్రక్రియను పూర్తిగా రద్దు చేయడం చట్ట విరుద్ధమని మండిపడ్డారు. హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తామని ప్రకటించారు. ఉద్యోగులు కోల్పోయిన వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఉత్తర బెంగాల్‌లోని రాయ్‌గంజ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

2016 టీచర్ రిక్రూట్‌మెంట్ ద్వారా చేసిన నియామకాలను, ఉపాధ్యాయ నియామక ప్రక్రియను పూర్తిగా రద్దు చేయడం చట్ట విరుద్ధం అని మమత తెలిపారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి అండగా నిలబడతామని.. వారికి న్యాయం జరిగేవరకు పోరాడతామని పిలుపునిచ్చారు. ఈ తీర్పును ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేస్తామని స్పష్టం చేశారు. ఇక ఉద్యోగాలు కోల్పోయిన వారు అధైర్యపడొద్దని కోరారు. అయినా నాలుగు వారాల్లోపు 8 సంవత్సరాల వేతనాన్ని తిరిగి చెల్లించడం ఎలా సాధ్యమవుతుంది? అని మమతా బెనర్జీ ప్రశ్నించారు. ఉద్యోగాలను రద్దు చేయడంతో పాటు వేతనాన్ని తిరిగి ఇచ్చేయాలన్న కోర్టు ఆదేశాలను తాము కచ్చితంగా సవాలు చేసి తీరుతామని మమత పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: IPL 2024: కోహ్లీకి భారీగా ఫైన్.. ఏకంగా మ్యాచ్ ఫీజులో..

కొందరు బీజేపీ నేతలు న్యాయవ్యవస్థను, న్యాయమూర్తులను ప్రభావితం చేస్తున్నారని మమత ఆరోపణలు చేశారు. ఇటీవల బీజేపీ నేత సువేందు అధికారి చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుంటుందని ఆయన చెప్పారని.. కోర్టు తీర్పు రాకముందే వారికెలా తెలిసిందంటూ మమతా నిలదీశారు. మమత వ్యాఖ్యాలకు సువేందు స్పందిస్తూ వివరణ ఇచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోని తిరుగుబాట్లతో పాటు అనిశ్చిత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తాను అలా చెప్పానని ఆయన తెలిపారు.

ఇది కూడా చదవండి: Botsa Jhansi Lakshmi: అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందాలంటే జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలి..

2016లో బెంగాల్ ప్రభుత్వం 24,650 ఖాళీలను భర్తీ చేసేందుకు పోటీ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలకు 23 లక్షల మందికి పైగా హాజరవ్వగా.. 25,753 మందికి అపాయింట్‌మెంట్‌ లెటర్లు ఇచ్చారు. అయితే ఈ నియామక ప్రక్రియలో అవకతవలు జరిగాయని ఆరోపణలొచ్చాయి. దీనిపై విచారణ జరిపిన కోల్‌కతా హైకోర్టు.. 2016 నాటి స్టేట్‌ లెవల్‌ సెలక్షన్‌ టెస్ట్‌ (SLST) నియామక ప్రక్రియ చెల్లదని స్పష్టం చేసింది. ఆ నియామకాలను రద్దు చేయాలని ఆదేశించడంతో పాటు ఉద్యోగులు తమ వేతనాల్ని తిరిగివ్వాలని కోర్టు వెల్లడించింది.

ఇది కూడా చదవండి: Israel-Iran War: అమెరికా తాజా రిపోర్ట్‌లో ఏం తేలిందంటే..!