హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల పరిధిలోని మున్సిపాలిటీల పరిధిల్లో ఉన్న పేదల ఇండ్ల నిర్మాణం కోసం ఇబ్బందులు లేకుండా, నిబంధనల మేరకు వారి ఇంటి స్థలాలను క్రమబద్ధీకరించి, వారికి న్యాయపరమైన హక్కులను కల్పిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి నోటరీ స్థలాలను జీవో 58, 59 ల ప్రకారం క్రమబద్ధీకరించుకోవడానికి మరో నెల రోజులపాటు గడువు పొడిగిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజల ను సీఎం కోరారు. తక్షణమే తమ తమ నియోజకవర్గాల పరిధిల్లోని ఎమ్మెల్యేలను కలిసి తమకున్న నోటరీ తదితర ఇండ్ల స్థలాల రెగ్యులేషన్ సమస్యలను తెలుపుకోవాలన్నారు. అన్ని సమస్యలను క్రోడీకరించి, పరిష్కరించి, వారికి న్యాయపరమైన హక్కులతో కూడిన పట్టాలను ప్రభుత్వం అందజేస్తుందని సీఎం తెలిపారు. ఏకకాలంలో ఒకే మొత్తంలో పేదల ఇండ్ల సమస్యలు పరిష్కారం కావాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యమని సీఎం అన్నారు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించనున్నట్లు తెలిపారు.
Also Read : Extramarital Affair: వివాహేతర సంబంధం.. పక్కా స్కెచ్ వేసి భార్య రివేంజ్
అదే సందర్భంలో.. వ్యవసాయ భూముల నోటరీ సమస్యలను కూడా పరిష్కరిస్తామని సిఎం అన్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించి కలెక్టర్ల కాన్ఫరెన్సు నిర్వహించనున్నామని తెలిపారు. ఈ మేరకు సోమవారం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తి మేరకు నోటరీ, 58,59 జీవోలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. మరో నెల రోజుల గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ చక్కని అవకాశాన్ని పేదలందరూ సద్వినియోగం చేసుకోవాలని సీఎం మరోసారి కోరారు.
Also Read : Wasim Akram: ధోనీకి అతడే సరైన వారసుడు.. సీఎస్కే కెప్టెన్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, నవీన్ కుమార్; బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాగంటి గోపినాథ్, దానం నాగేందర్, మాధవరం కృష్ణారావు, జాజుల సురేందర్, ఆత్రం సక్కు, ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసి, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సిఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, నవీన్ మిట్టల్, ప్రియాంకవర్గీస్ తదితరులు పాల్గొన్నారు.