ఆంధ్రప్రదేశ్ను విజ్ఞాన–సాంకేతిక పరిశోధనల్లో ముందుకు తీసుకెళ్లే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘ఏపీ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ (AP FIRST)’ పేరుతో తిరుపతిలో రాష్ట్రంలోనే అతిపెద్ద రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేయడానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తిరుపతిలోని IIT–IISER కాంబినేషన్తో AP FIRST రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేంద్రం ద్వారా అత్యాధునిక పరిశోధనలు, ఇన్నోవేషన్కు వేదికగా నిలిచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. యువత భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా ఈ కేంద్రంలో పరిశోధనలు సాగనున్నాయి.
Read Also: MSVG : 4 రోజులు.. 200 కోట్లు.. మెగా మాస్ ఆన్ డ్యూటీ!
ఈ నేపథ్యంలో ఏరోస్పేస్, డిఫెన్స్, ఐటీ–డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రంగాల సలహాదారులతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన పరిశోధనలపై, భవిష్యత్ సాంకేతిక అవసరాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. యువతకు, రాష్ట్రానికి మేలు జరిగేలా AP FIRST అతిపెద్ద రీసెర్చ్ కేంద్రంగా రూపుదిద్దుకోవాలని సూచించారు. నూతన ఆవిష్కరణలు, పరిశోధనల ద్వారా ఆంధ్రప్రదేశ్ను జ్ఞాన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. AP FIRST ద్వారా ఏరోస్పేస్–డిఫెన్స్, డిజిటల్ టెక్నాలజీలు, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో ప్రపంచ స్థాయి పరిశోధనలు జరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ కేంద్రం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా, రాష్ట్రానికి దీర్ఘకాలిక అభివృద్ధికి దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు.
