Land Pass Books: ఏపీ రైతులకు శుభవార్త.. రేపు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ..

Patta Books

Patta Books

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ ఖరారైంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఉదయం 11:20 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బనగానపల్లెకు చేరుకుంటారు.

అక్కడ నుండి ఉదయం 11:40 గంటలకు బనగానపల్లె తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని, స్థానిక ప్రజలు, వివిధ వర్గాల రైతన్నలతో నేరుగా ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు అక్కడ ఏర్పాటు చేసిన ‘ప్రజావేదిక’ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పట్టాదారు పాస్ పుస్తకాలను స్వయంగా పంపిణీ చేయనున్నారు.

ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2:35 గంటలకు బనగానపల్లె నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. పార్టీ బలోపేతం, స్థానిక పరిణామాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై వారికి దిశానిర్దేశం చేసిన అనంతరం, సాయంత్రం 4:20 గంటలకు బనగానపల్లె నుండి తిరిగి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసానికి సీఎం చంద్రబాబు బయల్దేరుతారు.

ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని నంద్యాల జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ బనగానపల్లెలో భారీ బందోబస్తుతో పాటు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశాయి. నియోజకవర్గ నేతలు కూడా ఈ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.