AP CM Chandrababu Naidu Reach Kuppam: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పం చేరుకున్నారు. నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు తొలిసారి కుప్పంలో పర్యటిస్తున్నారు. ఇక్కడ రెండు రోజుల పాటు సీఎం పర్యటన కొనసాగనుంది. మంగళవారం హంద్రీ-నీవా కాలువను పరిశీలించడంతో పాటు ఆర్టీసీ బస్టాండు సమీపంలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు.
కుప్పం చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడుకు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, అధికారులతో సహా ప్రజలు ఘన స్వాగతం పలికారు. దాంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఇక సరికొత్తగా కుప్పంలో సీఎం పర్యటన కొనసాగుతోంది. సీఎం పర్యటనకు ఉండే సెక్యూరిటీకి పూర్తి భిన్నంగా.. చంద్రబాబు టూర్ సాగుతోంది. పోలీసులు, ప్రత్యేక సెక్యూరిటీ లేకుండా చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ప్రతిఒక్కరు బస్సు దగ్గర వచ్చి బాబుకు అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రజలు, కార్యకర్తలతో మమేకం అవుతూ.. బాబు తన పర్యటనను కొనసాగిస్తున్నారు.