ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుపై సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇవాళ, రేపు రెండు రోజులపాటు కలెక్టర్ల సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశం ఏపీ సచివాలయంలో జరగనుంది. సమావేశం ఉదయం 10:30 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగంతో ప్రారంభం కానుంది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలపై సీఎం అధికారులతో చర్చించనున్నారు.
మొదటి రోజు సమావేశంలో ప్రధానంగా స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాల అమలు, జిల్లాల వారీగా నిర్ణయించిన అభివృద్ధి లక్ష్యాలు, వాటి పురోగతిపై సమీక్ష జరగనుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సీఎం చంద్రబాబు మార్గదర్శకాలు ఇవ్వనున్నారు. రెండో రోజు సమావేశంలో ప్రజలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా ప్రజారోగ్యం, సంక్షేమ పథకాల అమలు, రెవెన్యూ వ్యవహారాలు, వేసవికాలంలో తాగునీటి సరఫరా కోసం తీసుకోవాల్సిన చర్యలు వంటి విషయాలపై అధికారులు సమగ్రంగా చర్చించనున్నారు.
అదే విధంగా గురువారం సాయంత్రం రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితిపై ప్రత్యేక సమీక్ష సమావేశం కూడా నిర్వహించనున్నారు. రాష్ట్రంలో భద్రతా పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు అండ్ ఇతర విభాగాల అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష జరపనున్నారు. ఈ రెండు రోజుల సమావేశం ద్వారా జిల్లాల అభివృద్ధి కార్యక్రమాల్లో వేగం పెంచడం, ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
