NTV Telugu Site icon

CM Chandrababu: చేనేత దినోత్సవం.. సతీమణి కోసం స్వయంగా చీరలు కొన్న సీఎం చంద్రబాబు

Chandrababu

Chandrababu

CM Chandrababu: చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. చేనేత వస్త్రాలను ప్రోత్సహించడం, క్విట్ ఇండియా మూవ్మెంట్ కూడా ఇదేరోజు జరిగిందన్నారు. చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి నేతన్నలు తమ ఉత్పత్తులతో స్టాల్స్‌ ఏర్పాటు చేయగా.. స్టాళ్లల్లో ఉత్పత్తులను పరిశీలించి వారితో మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆ స్టాళ్లలో సతీమణి భువనేశ్వరి కోసం చీరలను కొనుగోలు చేశారు. చీరల గురించి అడిగి తెలుసుకుని మరీ రెండు చీరలను కొనుగోలు చేశారు సీఎం చంద్రబాబు. వెంకటగిరి చీర, ఉప్పాడ జాందాని చీరలను సీఎం కొనుగోలు చేశారు.

Read Also: Thummala Nageswara Rao: మంత్రి తుమ్మల నివాసంలో జీఆర్ఏంబీ చైర్మన్ సిన్హా భేటి..

అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. చేనేత కార్మికులకు భరోసా ఇచ్చేందుకు ఈ కార్యక్రమానికి వచ్చానన్నారు. చేనేత కార్మికులు ఉన్న ప్రతీచోటా టీడీపీ గెలుస్తుందన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో చేనేత కార్మికులకు పూర్తిగా అన్యాయం జరిగిందని.. నేతన్న నేస్తం అంటూ చేనేతలకు అన్యాయం చేశారని విమర్శించారు. రుణాల పేరిట చేనేతల పొట్టకొట్టారని మండిపడ్డారు. చేనేతల కోసం పని చేసిన పార్టీ టీడీపీ అని.. చేనేతల కోసం 110 కోట్ల ఋణమాఫీ చేశామన్నారు. 90, 500 కుటుంబాలకు ఉచిత విద్యుత్ ఇచ్చామన్నారు. 50 ఏళ్ళకే పెన్షన్ ఇచ్చిన ఘనత మాది‌ అని సీఎం స్పష్టం చేశారు. బీసీల కోసం ఒక ప్రత్యేక చట్టం తెస్తామని.. బీసీ సబ్ ప్లాన్‌కు 5 ఏళ్ళలో 1.5లక్షల కోట్లు ఇస్తామని చంద్రబాబు వెల్లడించారు. బీసీలకు చట్టసభల్లో 35% అవకాశం కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేస్తామన్నారు. ఏపీలో ఖజానా దివాళా తీసిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. 80 నుంచీ 90 వేల కోట్ల అప్పు ప్రతీనెలా ఉందన్నారు.

Read Also: Attempt to Murder: భూమి కోసం సొంత చెల్లెనే హత్య చేయించేందుకు ప్లాన్ చేసిన అక్క..

ఏపీ అవినీతి, దోపిడి, విధ్వంసంతో నిండిపోయిందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేశామని.. లేకపోతే మీ ఆస్తులు మీవి కాకుండా పోయేవని సీఎం చెప్పారు. పేదవాళ్ళ ఆస్తులు కొట్టేయడమే గత ప్రభుత్వంలో ఆనవాయితీగా మారిపోయిందని విమర్శించారు. అన్నదానం చేయాలనుకునే వారు అన్న క్యాంటీన్ ను వినియోగించుకోవాలని సీఎం సూచించారు. దేశంలోనే మొదటిసారి స్కిల్ సెన్సస్ చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. గతంలో దేవుడు ఇచ్చిన ఇసుకను కూడా అమ్ముకున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత ఇసుక ఇవ్వాలని నిర్ణయించామని.. ఈ మేరకు ఇస్తున్నామని ఆయన చెప్పారు. ప్రస్తుతం కృష్ణాజలాలు కూడా పరవళ్ళు తొక్కుతున్నాయని.. కనకదుర్గమ్మ దయవల్ల కృష్ణమ్మ వస్తోందన్నారు. పేదరికం లేని సమాజం కోసం పని చేస్తున్నామని.. పేదరికాన్ని ప్రభుత్వం, ప్రజల భాగస్వామ్యంతో నిర్మూలించాలన్నారు. పేదోడికి అండగా ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మరల జన్మభూమి లాంటి కార్యక్రమాలు చేయాలని నిర్ణయించామన్నారు.

Read Also: Minister Satya Prasad: మదనపల్లె ఫైళ్ల దహనం ఘటనలో కుట్ర కోణం.. సీఐడీ విచారణలో తేలుస్తాం!

64 క్లష్టర్లు ఏపీలో చేనేతకు ఉన్నాయని.. చేనేత వస్త్రాలపై జీఎస్టీ తీసేసే ప్రయత్నం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. జీఎస్టీ తీసేయలేకపోతే.. ఆ మొత్తం అంతా మీకు రీఇంబర్సుమెంటు ఇచ్చే అవకాశం చూస్తామన్నారు. సుమారుగా జీఎస్టీ రీఇంబర్సుమెంటుకు 65 కోట్లు అవుతుందన్నారు. 64 క్లష్టర్లలో చేనేతలకు ప్రత్యేకంగా మగ్గాలు ఏర్పాటు చేస్తామన్నారు. చేనేత వస్త్రాలు నేరుగా కొనే అవకాశం ఇస్తామన్నారు. ఓపెన్ నెట్వర్క్ ఫర్ కామన్ బిజినెస్‌ను మీ అందరికీ నేర్పించి అంతర్జాతీయంగా మీ అమ్మకాలు జరిగేలా చేస్తామని నేతన్నలకు హామీలు గుప్పించారు. ప్రభుత్వం, ప్రైవేటు రంగాలలో చేనేత కోసం అవకాశాలు ఏర్పాటు చేస్తామన్నారు. నెలకి 200 యూనిట్లు నెలకు ఇచ్చేలా ప్రధానమంత్రి సూర్యకిరణ్ స్కీం లాగా మేం సిద్ధం చేస్తామన్నారు. పర్యావరణ దృష్ట్యా సహజ రంగులు వినియోగించే అవకాశాలు చూడాలన్నారు. తాను పరుగెత్తి పరుగెత్తించడం వల్లే హైదరాబాద్‌ అలా అయ్యిందన్నారు.