Bhatti Vikramarka : కోటి ఆశలతో తెచ్చుకున్న రాష్ట్రాన్ని అప్పుల మయం చేశారు

Bhatti Vikramarka

Bhatti Vikramarka

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల నుంచి ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, రఘునందన్‌ రావు లను స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో అధికార టీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష కాంగ్రెస్‌ ల మధ్య చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఐదు లక్షల కోట్లు అప్పు చేశారని, రాష్ట్రాన్ని అప్పుల మయం చేశారని ఆరోపించారు. నేరుగా తెచ్చిన అప్పులు బడ్జెట్‌లో చూపించారు. కార్పొరేషన్ లకు గ్యారెంటీ ఇచ్చి అప్పులు తెచ్చింది ప్రభుత్వం అని ఆయన మండిపడ్డారు.

 

ఇప్పుడు నేరుగా తెచ్చిన అప్పులతో కార్పొరేషన్ అప్పులను కూడా కేంద్రం కలిపి చూస్తుందని, కోటి ఆశలతో తెచ్చుకున్న రాష్ట్రాన్ని అప్పుల మయం చేసిందని, ప్రతి బడ్జెట్‌లో వాస్తవాలు దాచారు అని చెప్పినా.. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి దాటింది అంటూ ఆయన విమర్శించారు. అప్పులు ఆగిపోతే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎలా కడతారని, మేము చెప్పినప్పుడు మాట వింటే ఈ సమస్య వచ్చేది కాదని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రంతో బాగున్నప్పుడు ఒక మాదిరిగా.. బాగొలేనప్పుడు ఒక మాదిరిగా కేంద్రం వ్యవహారం ఉందని, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్‌గా ఈ ఆర్ధిక పరిస్థితి చూస్తే బాధేస్తుందని ఆయన అన్నారు.