తెలంగాణ కాంగ్రెస్ లో నిత్యం వివాదాలే… నేతల మధ్య యుద్ధాలే. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఉన్న విబేధాలు గాంధీభవన్ సాక్షిగా బహిర్గతమయ్యాయి. అదికూడా కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ వచ్చినప్పుడే.. ఆయన ఎదుటే డిష్యుం డిష్యుం. హస్తం నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు వచ్చిన సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఎదుటే కాంగ్రెస్ నేతలు రెచ్చిపోవడం హాట్ టాపిక్ అవుతోంది. గాంధీభవన్లో ఒకరినొకరు కాలర్లు పట్టుకుని వాగ్వాదానికి దిగడంతో అవాక్కవ్వడం దిగ్విజయ్ వంతైంది.
గాంధీభవన్లో ఎన్ఎస్యూఐ విద్యార్థి నేతలతో అనిల్కుమార్ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అనిల్కుమార్పై ఎన్ఎస్యూఐ విద్యార్థి నేతలు దాడికి ప్రయత్నించారు. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డినే తిడతావా అంటూ అనిల్పై ఎన్ఎస్యూఐ నేతలు దాడి చేశారు. ఈ సందర్భంగా జై కాంగ్రెస్.. సేవ్ కాంగ్రెస్, దొంగల నుంచి పార్టీని కాపాడాలంటూ వారంతా నినాదాలు చేశారు. అనంతరం, అనిల్ కుమార్ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. దీంతో, గాంధీభవన్లో ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొంది. అక్కడేం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు.
Read Also: Sudigali Sudheer: గాలోడు గట్టి ఆఫర్ నే పట్టేశాడే..?
ఈ ఘటన పై కాంగ్రెస్ నేత మల్లురవి స్పందించారు. గాంధీభవన్ లో జరిగిన విషయాలు దిగ్విజయ్ సింగ్ దృష్టికి తీసుకువెళ్తాం అన్నారు. ఓయూ విద్యార్థుల అంశాలు పార్టీ దృష్టిలో ఉన్నాయి. వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యక్తిగత దూషణలు చేయవద్దు. అన్ని సమస్యలపై కూర్చుని మాట్లాడుకుందాము అని కామెంట్స్ చేశారు. ఇదిలా ఉంటే… గాంధీభవన్ కి వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఎవరూ లేరన్నారు.
దిగ్విజయ్ సింగ్కు కొన్ని సలహాలు ఇచ్చాను. ఆయన కూడా మాకు కొన్ని సలహాలు ఇచ్చారు. అందరం కలిసి రెండు రోజుల్లో మీ ముందుకు వస్తాం అన్నారు. కాంగ్రెస్ నేతలంతా ఐకమత్యంతో ముందుకు వెళ్తాం అన్నారు. పార్టీలో ఇలాంటివి మామూలే.. అన్నీ సామరస్యంగా పరిష్కారం అవుతాయన్నారు జానారెడ్డి.గాంధీభవన్లో గొడవ విషయంలో విజయ్ తొందర పడ్డాడు. అలా జరగకుండా ఉండాల్సింది..అందరినీ సమన్వయ పరిచేందుకే దిగ్విజయ్ సింగ్ వచ్చారన్నారు జానారెడ్డి.
Read Also: Venkaiah Naidu: తెన్నేటి విశ్వనాథం అందరికీ ఆదర్శం