CJP Protest: “4 గంటల సమయం దండగ”.. జేపీ నడ్డాతో భేటీపై సీజేపీ నేతల తీవ్ర ఆగ్రహం!

Cjp Rejects

Cjp Rejects

CJP Protest: మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. నీట్-యుజి (NEET-UG) పేపర్ లీక్ ఆందోళనకారులతో జరిపిన చర్చలు చాలా ప్రయోజనకరంగా సాగాయంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చేసిన ప్రకటన పూర్తిగా అసత్యమని ఆ పార్టీ తేల్చిచెప్పింది. సీజేపీ ప్రతినిధులు ఆశుతోష్ రంకా, సౌరభ్ దాస్‌లు ఈ సమావేశాన్ని తీవ్రంగా ఖండించారు. ‘ఛలో సంసద్’ నిరసనల మధ్య జరిగిన ఈ భేటీ వల్ల దాదాపు నాలుగు గంటల సమయం వృధా తప్ప ఏమీ లేదని, అసలు ఏ పురోగతీ సాధించలేదని వారు స్పష్టం చేశారు. కేవలం 10 నిమిషాల భేటీ కోసం రెండు గంటలకు పైగా నిరీక్షించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

సోమవారం ఉదయం నిరసనకారులు సంప్రదింపులకు ముందుకు వచ్చారని, చర్చలు జరుగుతున్నాయని, వినతిపత్రం స్వీకరించిన అనంతరం ఆందోళన విరమించాలని నడ్డా సోషల్ మీడియా (X) ద్వారా కోరారు. అయితే, ఉద్యమ తీవ్రతను చూసి భయపడే ప్రభుత్వం ఈ విధంగా వ్యర్థమైన చర్చల పేరుతో సమయం వృధా చేసిందని సీజేపీ కౌంటర్ ఇచ్చింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, లీకేజీ బాధితులైన అభ్యర్థుల కుటుంబాలకు రూ. 1 కోటి పరిహారం, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నిరసనపై ఉన్న ఆంక్షలను సడలించి ఆయనను వెంటనే విడుదల చేయడం వంటి తమ ప్రధాన డిమాండ్లపై కేంద్రం ఎలాంటి హామీ ఇవ్వలేదని సీజేపీ నాయకులు వెల్లడించారు.

మరోవైపు, దేశవ్యాప్తంగా దాదాపు 50 లక్షలకు పైగా విద్యార్థులు నీట్, జేఈఈ, సీయూఈటీ వంటి పరీక్షలు రాశారని, చాలామంది అర్హులైన విద్యార్థులు ఇప్పటికే కౌన్సెలింగ్‌లో బిజీగా ఉన్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఆరోపణలు వచ్చిన వెంటనే రీ-ఎగ్జామ్ నిర్వహించి బాధ్యులపై చర్యలు చేపట్టామని, శాంతిభద్రతల సమస్య రాకుండా పోలీసులు సైతం గరిష్ట సంయమనం పాటిస్తున్నారని తెలిపారు. అయితే వ్యవస్థాగత వైఫల్యాలకు ఉన్నతాధికారులే బాధ్యత వహించాలని, తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం ఆపేది లేదని ఆందోళనకారులు స్పష్టం చేశారు.