CJP Protest: ఢిల్లీ వేదికగా సాగుతున్న ఆందోళనలు ఇప్పుడు మరో మలుపు తిరిగాయి. కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) చేపట్టిన నిరసనలు నేటితో 32వ రోజుకు చేరుకోగా, ఉద్యమకారులు తమ డిమాండ్ల జాబితాను మరింత విస్తరించారు. జూలై 20న జరిగిన నిరసనల్లో పాల్గొన్న శాంతియుత ఉద్యమకారులపై ఎలాంటి ఎఫ్ఐఆర్లు నమోదు చేయకూడదని, వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకూడదని తాజాగా డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉద్యమకారులను ఉద్దేశించి మాట్లాడిన పార్టీ ప్రతినిధి అశుతోష్ రాంకా.. “శాంతియుతంగా నిరసన తెలిపినా తమను ఎక్కడ లక్ష్యంగా చేసుకుంటారోనని చాలామంది ఆందోళన చెందుతున్నారు. కానీ శాంతియుతంగా నిరసన తెలిపిన వారిపై ఎలాంటి చర్యలు లేకుండా మేం చూసుకుంటాం. మీకంటే ముందే మేం అరెస్టు కావడానికి సిద్ధంగా ఉన్నాం” అని భరోసా ఇచ్చారు.
ప్రస్తుతం ఈ పోరాటం నాలుగు ముఖ్యమైన డిమాండ్లతో కొనసాగుతోందని రాంకా స్పష్టం చేశారు. సోనమ్ వాంగ్చుక్ విడుదల, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఆత్మహత్య చేసుకున్న నీట్ (NEET) అభ్యర్థుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం చెల్లించడంతో పాటు జూలై 20 నాటి నిరసనకారులపై ఎలాంటి కేసూ పెట్టకపోవడమే తమ ప్రధాన డిమాండ్లని ప్రకటించారు. ఉద్యమాన్ని తొక్కేయాలని చూస్తున్న కొద్దీ ఇది మరింత బలపడుతోందని, విద్యార్థులకు నిరసనలు తెలపడం రాదన్న వారికి ఈ పోరాటమే కళ్లు తెరిపించే సమాధానమని వ్యాఖ్యానించారు.
జూలై 20న జరిగిన ఘటనలను గుర్తుచేస్తూ.. పోలీస్ చర్యలు, టెంట్లు వేయకుండా విధించిన ఆంక్షలతో నిరసనలు ముగిసిపోతాయని అధికారులు భావించారని రాంకా ఆరోపించారు. “ఆ రోజు విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయించి, టెంట్లు వేయనివ్వకపోతే ఉద్యమం ఆగిపోతుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ ఆందోళన వంద రెట్లు పెద్దదిగా మారింది” అని ఆయన అన్నారు. ఆ రోజు ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరును ప్రపంచమంతా చూసిందని మండిపడిన ఆయన, ప్రభుత్వం అహంకారాన్ని దించేందుకే ఈ నిర్ణయాత్మక పోరాటం అని పిలుపునిచ్చారు. నిన్నటివరకు తమను ‘బొద్దింకలు’, ‘వైరస్’ అని అవమానించిన ప్రభుత్వమే ఇప్పుడు దిగివచ్చిందని, ప్రజలు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రారంభించారని, ఇదే తమ నిరసన సాధించిన అతిపెద్ద విజయమని పేర్కొన్నారు.
మరోవైపు, ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించి సీజేపీతో తొలిసారిగా అధికారిక చర్చలు జరిపిన రెండు రోజులకే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. గత సోమవారం సీజేపీ ప్రతినిధులు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్లను కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఢిల్లీలోని తన నివాసానికి ఆహ్వానించి మాట్లాడారు. ఈ భేటీలో తమ డిమాండ్లతో కూడిన లిఖితపూర్వక వినతిపత్రాన్ని సీజేపీ ప్రతినిధులు అందజేశారు. దీనిపై బీజేపీ అగ్రనాయకత్వంతో చర్చించి నిర్ణయం తీసుకునేందుకు జేపీ నడ్డా కొంత సమయం కోరారని రాంకా ఇదివరకే వెల్లడించారు.

